Nimmagadda : ఏపి లో ప్రభుత్వం GOVT, ఎస్ఈసీ SEC మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వంపై ఎస్ఈసీ, ఎస్ఈసీపై ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలను మంత్రులు, వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఆరోపణలుచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సైతం ఎస్ఈసీ సీనియర్ ఐఎఏస్ అధికారుల బదిలీలపై తీవ్రంగా స్పందించి విమర్శలు చేశారు. ఇలా ఎస్ఈసీపై అధికార పక్షం నుండి విమర్శలు, ఆరోపణలు వస్తూనే ఉన్నా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను చేయాలనుకున్న పనులు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఏకగ్రీవాలపై మరో బాంబు పేల్చారు నిమ్మగడ్డ.
రాష్ట్రంలో అధికార వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేస్తుందని ఒక పక్క ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు బీజెపీ కూడా విమర్శిస్తున్నది. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తదితర నేతలు రెండు రోజుల క్రితం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఏకగ్రీవాలకు గ్రామాల్లో వైసీపీ అనుసరిస్తున్న వైఖరిని వివరించారు. ఆన్ లైన్ ద్వారా నామినేషన్ల స్వీకరణ ప్రవేశపెట్టాలని కోరారు.
ఇదిలా ఉండగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవాలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవాలకు ప్రజల నుండి ఎలాంటి ఆదరణ లేదని తెలిపారు. పోటీవల్ల ప్రజస్వామ్య వ్యవస్థ బలపడుతుందని అన్నారు. ప్రస్తుతం చాలా మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కువ ఏకగ్రీవాలు జరిగితే వ్యవస్థలో వైఫల్యంగా భావించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
మరో పక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో ఏకగ్రీవాలు అయిన మండల పరిషత్ అభివృద్ధి అదికారులను బదిలీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాధ్ దాస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 30 మంది ఎండిఓలను బదిలీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే గతంలో ఆగిపోయిన మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.