ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే లోన్ యాప్ ల దందా బయటపడింది. హైదరాబాద్ మలక్పేటలోని ఆజంపురాకు చెందిన థియోఫిలా నిరీక్షన్ అనే మహిళ ‘‘ఐ క్రెడిట్, రూపే ప్లస్” యాప్స్ నుంచి పోయినేడాది లోన్ తీసుకుంది. రూ.10 వేలు తీసుకున్న ఆమె.. గడువులోగా ఆ మొత్తం కట్టేసింది. అయితే ఈ ఏడాది ఆగస్టులో ఆమె అకౌంట్లో రూ.10,500 డిపాజిట్ చేశారు. ఏదో తప్పు జరిగి అమౌంట్ వచ్చిందని చెప్పడంతో, ఆమె ఇంట్రెస్ట్తో సహా డబ్బులు కట్టింది. ఆ తర్వాత కూడా 6 యాప్స్ నుంచి రూ.5వేల చొప్పున థియోఫిలా అకౌంట్లో రూ.30వేలు డిపాజిట్ చేశారు. వాటికి కూడా ఇంట్రెస్ట్, జీఎస్టీ, చార్జీలు చెల్లించాలని వేధించారు. దీంతో ఆమె సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు నవంబర్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. లోన్ యాప్స్ దందా గుట్టురట్టు చేశారు. గుర్గావ్, హైదరాబాద్ లో మంగళవారం తనిఖీలు చేసి11 మందిని అరెస్టు చేశారు. గుర్గావ్ లో అరెస్టు చేసిన ఐదుగురిని సిటీకి బుధవారం తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లో అరెస్టు చేసిన మూడు ఆరుగురిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. కాల్ సెంటర్లలోని 600 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు.
మోడస్ అపరాండీ ఎలాగంటే?
ప్రధాన నిందితుడైన మధుబాబు సింగి పోయినేడాది ఢిల్లీలోని మొబైల్ యాప్స్ కంపెనీలో పని చేశాడు. ఆ టైమ్ లో చైనాకు చెందిన కంపెనీ హెడ్తో పరిచయమైంది. లాక్ డౌన్ లో హైదరాబాద్ కు వచ్చిన మధుబాబు.. చైనా దేశస్తురాలి డైరెక్షన్ లో ఢిల్లీలోని తన కొలీగ్ తరుణ్తో కలిసి బెంగళూరులో 4 కంపెనీలు రిజిస్టర్ చేయించాడు. బేగంపేట్, పంజాగుట్టలో మూడు కాల్సెంటర్లు స్టార్ట్ చేశాడు. గుర్గావ్ లోని లోన్ యాప్ కంపెనీలకు థర్డ్ పార్టీగా లోన్ల రికవరీ సేవలందించడం ప్రారంభించాడు. తక్కువ శాలరీలకే 600 మందిని ఎంప్లాయీస్ ను నియమించుకొని, వారికి మాదాపూర్లోని ‘‘ఫోకస్’’ అనే ఔట్ సోర్సింగ్ సంస్థ నుంచి డబ్బులు డిపాజిట్ చేస్తున్నాడు. గుర్గావ్ నుంచి వచ్చే డేటాతో కాల్ చేసి డబ్బులు కట్టాలని వేధిస్తారు. ఒక్కో కాలర్ రోజూ 80 మందికి ఫోన్ చేయాలని టార్గెట్ పెట్టారు. ఈ మూడు కాల్ సెంటర్ల నిర్వహణ మధుబాబు, అతని ఫ్యామిలీనే చూసుకుంటోంది.మధుబాబు వాట్సాప్ డేటాతో పోలీసు అధికారులు ఇండోనేషియా జకర్తాలోని చైనా దేశస్తురాలి ఆధారాలు సేకరించారు. చైనా యాప్స్ నుంచే లోన్స్ ఇస్తున్నట్లు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు.