Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఊహించని షాక్ ఇది. కరోనా కట్టడి కోసం వేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగించాలన్నది భారత ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సినేషన్ జరుగుతుండగా.. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయనున్నారు. అయితే, మే 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ సాధ్యం కాదని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ప్రకటించాయి. తాజాగా, ఈ జాబితాలో మరో రాష్ట్రం చేరింది.
అసలు సమస్య అదే…
మహారాష్ట్రలో కరోనా కల్లోలమే సృష్టిస్తోంది.. భారత్లో నమోదు అవుతోన్న పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్యలోనూ మహారాష్ట్రదే అగ్రభాగం అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో మే 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. టీకాల కొరత కారణంగా మే 1వ తేదీ నుండి వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం కాకపోవచ్చునని మహారాష్ట్ర సర్కార్ తెలిపింది. వ్యాక్సిన్లు చేరుకున్న తర్వాత 18 ఏళ్ల పైవారికి కొంత ఆలస్యంగా టీకాలు ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది.
అందరికీ ఫ్రీ కానీ…. వ్యాక్సిన్ ఇవ్వలేం
18 ఏళ్లు పైబడినవారికి అందిరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించినా.. దానిలో క్లారిటీ లేకపోవడంతో.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కోసం ప్రత్యే బడ్జెట్ను కేటాయిస్తున్నాయి. ఈ ఒరవడిలో మహారాష్ట్ర కూడా ఫ్రీ వ్యాక్సిన్ అంటూ ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేయాలని తమ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు.. అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ప్రకటించారు. అయితే, ఆ మరుసటి రోజే వ్యాక్సిన్ ఇవ్వలేమనే ప్రకటన రావడం గమనార్హం.