Nimmagadda : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత ఎన్నికలు వద్దన్నా ప్రభుత్వం ఇప్పుడు సహకరిస్తూనే ఉంది. ఎన్నికల సంఘానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తూ ఉంది. మొత్తం నాలుగు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి అయ్యాయి. రెండవ దశ పోలింగ్ రేపు శనివారం జరగనున్నది.
ఈ తరుణంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గతంలో మాదిరిగానే తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేస్తూ పనిలో పనిగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎస్ఈసీ సీరియస్ అయ్యింది. కొడాలి నానికి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం అయిదు గంటల లోగా వ్యక్తిగతంగా గానీ, ప్రతినిధి ద్వారా గానీ వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది. లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని..ఎస్ఈసీ నోటీసుపై ఏ విధంగా స్పందిస్తారు ? తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటారా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎస్ఈసీ ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై చర్యలు తీసుకున్నది. ఈ నెల 17వ తేదీ వరకూ మీడియాతోనూ, సభలు, సమావేశాల్లో మాట్లాడటానికి వీలులేదని ఎస్ఈసీ ఆదేశాలు చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. అయితే దీనిపై నోటీసులు ఇవ్వకుండా చర్యలు ఎలా తీసుకుంటారని జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు. తనపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలంటూ ఆయన ఎస్ఈసీకి లేఖ రాశారు.
కాగా.. ఇంతకు ముందు నోటీసులు ఇవ్వకుండా నేరుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మంత్రి కొడాలి నానిపై చర్యలకు గానూ ఎస్ఈసీ ముందుగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఓ పక్క ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న తరుణంలో మంత్రి నాని వివాదాస్పద వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసుల అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.