Nimmagadda : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ, ప్రభుత్వానికి మద్య వివాదం తారా స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి వీలులేదని ప్రభుత్వం, ఎలాగైనా ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించడంతో ఈ వివాదం హైకోర్టు ఆ తరువాత సుప్రీం కోర్టు వరకూ వెళ్లడం చివరకు సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమయ్యింది. సుప్రీం తీర్పు గౌరవిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, వైసీపీ నేతలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శల దాడి ఏమి తగ్గించలేదు. దీనికి తోడు ఎస్ఈసీ ఆదేశాలను ప్రభుత్వం అంతగా పట్టించుకోవడం లేదు.
Nimmagadda : కార్యదర్శిగా రవిచంద్ర పేరు సిఫార్సు చేసిన నిమ్మగడ్డ
ఇప్పుడు తాజాగా ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య మరో వివాదం నెలకొంది. ఈ నెల ప్రధమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ కార్యదర్శి వాణి మోహన్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రభుత్వానికి సెరండర్ చేశారు. ఆమె స్థానంలో ముగ్గురు ఐఎఎస్ అధికారుల పేర్లు సిఫార్సు చేయాలని ప్రభుత్వానికి ఎస్ఈసీ రెండు పర్యాయాలు లేఖ రాశారు. ప్రభుత్వం నుండి గురువారం నాటి వరకూ ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరుగా ఐఎఎస్ అధికారి రవిచంద్రను ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. అయితే ప్రభుత్వం మాత్రం రవిచంద్రను వైద్య ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా నియమిస్తూ కరోనా వ్యాక్సిన్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది.
Nimmagadda : ముగ్గురు ఐఎఎస్ ల పేర్లు సిఫార్సు చేసిన ప్రభుత్వం
ఇక్కడ మరో విషయం ఏమిటంటే వైద్య ఆరోగ్య శాఖ లో ఇప్పటి వరకూ లేని పోస్టును సృష్టించి ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్మగడ్డ ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎన్నికల సంఘం కార్యదర్శి పోస్టు కోసం ఐఏఎస్ అధికారులు రాజబాబు, కన్నబాబు, విజయకుమార్ ల పేర్లను ఎస్ఈసీకి ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ప్రభుత్వం సిఫార్సు చేసిన ముగ్గురు ఐఎఎస్ లలో ఒకరి పేరు సిఫార్సు చేస్తారా లేక రవిచంద్రనే నియమించాలని పట్టుబడతారా అనేది తేలాల్సి ఉంది.