Omicron Effect: కరోనా ఒమైక్రాన్ వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయాలను వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరో మార మార్గదర్శకాలను జారీ చేసింది ఏపి సర్కార్. కేంద్ర హోంశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇకపై బహిరంగ ప్రదేశాలలో మాస్కు ధరించని వారికి రూ.100లు జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలో వ్యాపార సంస్థలకు బిగ్ షాక్ ఇచ్చేలా నిబంధనలు పేర్కొంది. మాస్కు లేని వారిని దుకాణాల్లో, వాణిజ్య సముదాయాల్లోకి అనుమతి ఇస్తే ఆ యాజమాన్యాలకు రూ.10వేల నుండి రూ.25 వేల వరకూ జరిమానా విధించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపార వాణిజ్య సంస్థలను రెండు రోజుల పాటు మూసివేసేలా కూడా చర్యలు తీసుకోవాలని తెలిపింది. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో జరిగే ఉల్లంఘటనలపై 8010968295 నెంబర్ కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని సూచించింది. ఉద్దేశపూర్వకంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఈ అంశాలను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
గత కొన్ని నెలలుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కోవిడ్ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. ప్రజలు ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు పూర్తి స్థాయిలో ధరించడం లేదు. వ్యాపార వాణిజ్య సంస్థల సంస్థల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఇతర దేశాల నుండి వచ్చిన వారి నుండి నుండి ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.