Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన తిరుపతి ఉప ఎన్నిక విషయంలో పవన్ నిర్ణయం గురించి చర్చ జరుగుతోంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార వైఎస్ఆర్సీపీ సహా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే, జనసేన మాత్రం చేతులు ఎత్తేసింది.
Pawan Kalyan : అప్పట్లోనే డౌట్లు…
తిరుపతి ఉప ఎన్నిక తెరమీదకు వచ్చిన నాటి నుంచి ఈ ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని జనసేన ప్రకటిస్తూ వస్తోంది. తమకే ఈ నియోజకవర్గంలో బలం ఉన్నందున అవసరమైతే ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసి ఒప్పిస్తామని జనసేన వర్గాలు పేర్కొన్నాయి. తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకు ఎక్కువ బలం ఉందని, జనసేనకు అవకాశం ఇస్తే తిరుపతి సీటును గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశాయి. అయితే, దీనిపై అప్పట్లోనే సందేహాలు వినిపించాయి. తాజాగా ఇదే నిజమైంది.
టైం దగ్గర పడటంతో….
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థిపై కసరత్తు చేసేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ఇంచార్జ్ సునీల్ డియోదర్ లు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గెలుపు ఓటములు సహా అభ్యర్థి గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముందుగా అంచనా వేసినట్లే ఈ సీటు బీజేపీ కి అవకాశం ఇవ్వాలని నిర్ణయం జరిగింది. బీజేపీకి జనసేన మద్దతు ఇస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. దీంతో అభ్యర్థి విషయంలో మళ్లీ పవన్ మాట నెగ్గకుండా పోయింది అంటున్నారు.