Pawan Kalyan : జనసేన పార్టీ నుండి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలోనూ, బయట వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. జనసేనతో పూర్తిగా కటీఫ్ చెప్పినట్టుగా రాపాక తన తనయుడిని వైసీపీ పార్టీలో చేర్చారు. సీఎం జగన్ తో పార్టీ కండువా కప్పించేశారు. అయితే రాజోలు నియోజకవర్గంలో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన పెదపాటి అమ్మాజీ నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు స్థానిక పంచాయతీ ఎన్నికలు రావడంతో నియోజకవర్గ వైసీపీలో గ్రూపు రాజకీయాలు బహిర్గతం అవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల విషయంలో ఓ వైసీపీ కార్యకర్తకు రాపాక వరప్రసాద్ ఫోనే చేసి తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. అయితీ ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు రావడంతో పాటు ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నియోజకవర్గానికి చెందిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహదేవ్ కు ఇటీవల రాపాక ఫోన్ చేసి నా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టడానికి నీవు ఎవరు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిలబెట్టలేదనీ, నియోజకవర్గ ఇన్ చార్జి అమ్మాజీ ప్రకటించారని సహదేవ్ చెప్పడంతో నా గ్రామానికి వచ్చి సర్పంచ్ ని మీరు గెలిపిస్తారా, వైసీపీ వాళ్లంతా పోరంబోకులు తయారు అయ్యారంటూ రాయలేని పదజాలంతో దూర్భాషలాడుతూ మండిపడ్డాడు.
ఈ సందర్భంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి అమ్మాజీ ని కూడా రాపాక విమర్శించినట్లు వార్తలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు రాపాకకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే ఆయన ఆ విధంగా ఫైర్ అయ్యారని అనుకుంటున్నారు. రాపాక వరప్రసాద్ వైసీపీ అసోసియేట్ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీ కార్యకర్తను తీవ్రస్థాయిలో దూషించడం ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేేచి చూడాలి.