Pawan Kalyan: కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలావురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో మంగళవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళన కారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలపై ప్రతిపక్షాలపై అనుమానం ఉందంటూ హోంశాఖ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. పత్రికా ప్రకటన విడుదల చేశారు పవన్ కళ్యాణ్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Pawan Kalyan: ప్రజలు సంయమనం పాటించాలి
అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్య వాదులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. ప్రజలు అందరూ సంయమనం పాటించాలని పవన్ కళ్యాణ్ కోరారు. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుందని అన్నారు. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువు గా మార్చడం దురదృష్టకరమని ఆ మహానీయుని పేరును వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
వారి వైఫల్యాలను జనసేన పై రుద్దవద్దు
అమలాపురంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైందని ఆరోపించారు పవన్ కళ్యాణ్. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. వాళ్ల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లా వాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. బాధ్యత కల్గిన పదవిలో ఉన్న హోంశాఖ మంత్రి ప్రకటన చేస్తూ జనసేన పేరును ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వ లోపాలను, శాంతిభద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేన పై రుద్దవద్దని పవన్ కళ్యాణ్ కోరారు.
ప్రజలందరూ సంయమనం పాటించాలి – JanaSena Chief Shri @pawanKalyan pic.twitter.com/NUUMCti6TR
— JanaSena Party (@JanaSenaParty) May 24, 2022