PM Modi Bhimavaram Tour: విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు 125 జయంతోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితం చేరుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా సీఎం వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ లు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి హెలికాఫ్టర్ లో భీమవరంకు చేరుకున్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే భీమవరం హెలిపాడ్ వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి అవమానం జరిగింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు హెలిపాడ్ వద్దకు అచ్చెన్నాయుడు రావడంతో ప్రధానికి స్వాగతం చెప్పే జాబితాలో పేరు లేదని చెప్పడంతో వెనుతిరిగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు హెలిపాడ్ కు రావాల్సిందిగా కోరారని అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ కు అందిన జాబితాలో తన పేరు లేదని చెప్పడంతో అచ్చెన్నాయుడు తిరిగి వెళ్లిపోయారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ కి ఇచ్చిన జాబితాలో పేరు ఉన్నప్పటికీ జిల్లా అధికారుల వద్ద జాబితాలో పేరు లేకపోవడం ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తన పేరు లేకపోవడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఆర్కే రోజా తదితర మంత్రులు పాల్గొన్నారు. తొలుత ప్రధాని మోడీకి సీఎం జగన్ జ్ఞాపికను అందజేసి సత్కరించారు. అదే విధంగా విల్లు బాణం బహుకరించారు. కొద్ది సేపటిలో క్షత్రియ సమాజం ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు కుటుంబానికి చెందిన వారసులను సత్కరించారు.
ప్రధాని మోడీ, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు అల్లూరి సీతారామరాజు గొప్పతాన్ని, ఆయన పోరాట పటిమను, త్యాగనిరతిపై ప్రసంగించారు. ఏపి ప్రభుత్వం అల్లూరి సీతారామ రాజు పేరుతో జిల్లాను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేస్తూ ఆ జిల్లాలోనూ నేడు అల్లూరి విగ్రహా అవిష్కరణ జరుగుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించి తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. కాగా గన్నవరం ఎయిర్ పోర్టు రోడ్డులో మోడీ గో బ్యాక్ అంటూ ప్లకార్డు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సుంకర పద్మశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భీమవరంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.