Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థిగా పుంతల సురేష్ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు దూరంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బద్వేల్ ఉప ఎన్నిక బరిలో బీజేపి అభ్యర్థిగా ప్రజా సమస్యల సాధనకై అనేక పోరాటాలు సాగించిన యువ నాయకుడు పుంతల సురేష్ దిగుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల సాధనకై గల్లీ నుండి ఢిల్లీ వరకూ పోరాటం చేయగల యువజన నాయకుడిని గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.
Badvel Bypoll: బీజేవైఎస్ జాతీయ కార్యదర్శి పుంతల సురేష్
తొలుత బద్వేల్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జయరాములును ఖరారు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో ప్రస్తుతం బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా ఉన్న పుంతల సురేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. టీడీపీ నుండి డాక్టర్ దాసరి సుధ, కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే పీఎమ్ కమలమ్మలు ఇప్పటికే నామినేషన్ లు దాఖలు చేసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలకు జనసేన, టీడీపీ దూరంగా ఉన్నాయి. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు నవతరం పార్టీ అభ్యర్థి ఎన్నికల బరిలో నిలవడంతో ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది.
ఎన్నికలకు దూరంగా జనసేన, టీడీపీ
దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను అధికార వైసీపీ పోటీకి దింపిన నేపథ్యంలో సంప్రదాయాలను అనుసరించి జనసేన, టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాయి. ఇతర రాజకీయ పక్షాలు పోటీ నుండి దూరంగా ఉంటే దాసరి సుధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు ఏకగ్రీవ ప్రతిపాదన చేసి ఉంటే పార్టీలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉండేది. కానీ వైసీపీ నుండి ఇతర రాజకీయ పక్షాలకు అటువంటి ప్రతిపాదన ఏమీ పంపలేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. వైసీపీ ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోయింది. రేపటి వరకూ నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.