Cinema Tickets: ఏపిలో సినిమా టికెట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. సినీ రంగం నుండి పలువురు నటులు చేసిన వ్యాఖ్యలపై ఏపి మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం సీరియస్ స్టెప్ తీసుకోవడంతో రాష్ట్రంలో ధియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. చాలా ధియేటర్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో వివాదాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఎగ్జిబిటర్లు తమ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు సమావేశమై చర్చించారు. మరో పక్క ఏపి ఫిలిం చాంబర్ నుండి ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినీరంగంలోని ఎవరూ ఈ విషయంపై ఇకపై వ్యాఖ్యలు చేయవద్దని కూడా సూచించారు.
Cinema Tickets: ప్రభుత్వ జోక్యం తగదు
అయినప్పటికీ తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా టికెట్ల అంశంపై స్పందించారు. సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదని అన్నారు. ఓ వస్తువు ఉత్పత్తిదారుడికే ఎంఆర్పీ ధర నిర్ణయించే అధికారం ఉంటుంది. కొనాలా వద్దా అనేది వినియోగదారుడు నిర్ణయించుకుంటారని వర్మ వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల రేట్లను నిర్మాతలు నిర్ణయించడంలో తప్పేమీలేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశం లో ప్రభుత్వం టికెట్ల ధరలు నిర్ణయించడం ఏంటో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఓ వస్తువును ప్రైవేటు వ్యక్తులు ఉత్పత్తి చేసి వినియోగదారుడికి విక్రయించే క్రమంలో పన్నులు ప్రభుత్వానికే వెళతాయని అయితే ఇందులో ప్రభుత్వం రేట్లు నిర్ణయించడం ఉండదని వర్మ అన్నారు. సినిమా టికెట్ల అంశానికి కూడా ఇదే వర్తిస్తుందని వర్మ పేర్కొన్నారు.