Skill Development Scam Case: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయగా, ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ ను ఏపీ సీఐడీ అధికారులు విచారణ జరపగా పలు కీలక పత్రాలు దొరికాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ జరిగింది. దాదాపు 279 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లాయని సీఐడీ పేర్కొంది.
2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాసిన ముఖ్యమైన నోట్ఫైల్స్ను సిఐడి అధికారులు గుర్తించారు. నోట్ఫైల్లో ఏముందంటే..సెప్టెంబర్ 8, 2015న ఒక ఫైల్ సీఎంవో నుంచి ఆర్ధికశాఖకు వచ్చింది. ఆ ఫైల్ వచ్చిన వెంటనే చీఫ్ సెక్రటరీ నుంచి ఆర్థికశాఖ సెక్షన్ ఆఫీసర్కు పిలుపొచ్చింది. ప్టెంబర్ 5, 2015న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సమావేశం జరిగిందని చీఫ్ సెక్రటరీ తనకు వెల్లడించినట్టు ఆర్థికశాఖ నోట్ఫైల్లో ఉంది. ఆ సమావేశానికి సంబంధించి మినిట్స్ కూడా పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సీమెన్స్ కంపెనీతో ఆగస్టు 21, 2015న ఒప్పందం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించినట్టు చీఫ్ సెక్రటరీ తనకు తెలిపారని ఆర్థికశాఖ కార్యదర్శి అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నిధులను (రూ.371కోట్లను) తక్షణం విడుదల చేయాలని, ఇది ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన ఆదేశమని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నట్టు నోట్ఫైల్లో ఉంది. వీలైనంత త్వరగా ఎండీయు కుదుర్చుకోవాలని సీఎం చెప్పినట్టు ఆర్థికశాఖ వ్యవహారాల్లో పేర్కొన్నారు.
ఆగస్టు 5, 2015న ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిన నోట్పై అప్పటి చీఫ్ సెక్రటరీ స్వయంగా కొన్ని కామెంట్లు రాశారు. దాంట్లో ఏముందంటే..”పారా నెంబర్ 27 ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం, చర్చల మేరకు తక్షణం బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేయాలని పేర్కొని ఉంది. దీంతో పాటు ఆగస్టు 27న రూ.270 కోట్ల నిధులకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ను విడుదల చేసే ప్రతిపాదన తయారయింది.
ఈ ప్రతిపాదనకు ఆఘమేఘాల మీద ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. సీమెన్స్ కంపెనీకి నిధులను వెంటనే విడుదల చేసేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఐడీ అధికారుల విచారణలో చంద్రబాబుకు, ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్తో జరిగిన వాట్సాప్ చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు లభించాయి. వీటికి సంబంధించి పక్కా ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. సరైన ప్రూఫ్ బయట పెట్టడం వల్లనే నాడు చంద్రబాబు చేసిన పాపం బయటపడి జైలుకు వెళ్లారని వైసీపీ నేతలు అంటున్నారు.