Vyooham: టాలివుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ మువీ రిలీజ్ కు బ్రేక్ పడింది. జనవరి 11వ తేదీ వరకూ విడుదలను నిలుపుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు మద్యంతర ఆదేశాలు ఇచ్చింది. వ్యూహం మువీకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. డిసెంబర్ 29న (శుక్రవారం) వ్యూహం సినిమా విడుదల కావాల్సి ఉంది. లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం ఇరుపక్షాల వాదనలు జరిగాయి.
పిటిషనర్ తరపున న్యాయవాది మురళీధర్ రావు వాదనలు వినిపించారు. వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ అజెండాతో రూపొందించారన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీఫేమ్ చేసే విధంగా సినిమా తీశారన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అనుకూలంగా చిత్రాన్ని రూపొందించారనీ, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల మీద దీని ప్రభావం పడుతుందన్నారు. ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్ పేరుతో డీ ఫేమ్ కు పాల్పడటం సరికాదనీ, దానికి కూడా ఒక హద్దు ఉంటుందని అన్నారు. ఈ సినిమా ప్రజలపై ప్రభావం చూపించేలా ఉంటుందని పేర్కొన్నారు.
మువీ నిర్మాణ సంస్థ తరపున సీనియర్ కౌన్సిల్, ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సినిమాకి సెన్సార్ బోర్డు ఇచ్చే సర్టిఫికెట్ యే ఫైనల్ అని, వారే ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయలేదని గుర్తు చేసిన నిరంజన్ రెడ్డి..సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇలా పిటిషన్ వేసే అర్హత లేదని చెప్పుకొచ్చారు. అయినా ఒక వ్యక్తిని, పార్టీని కించపరిచేలా సినిమా ఉంటే..సివిల్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేయాలని గాని ఇలా హైకోర్టు లో కాదని పేర్కొన్నారు.
అలాగే వ్యూహం మువీ డాక్యుమెంటరీ కాదనీ, సినిమాగా తెరకెక్కించేటప్పుడు స్వేచ్చ ఉంటుందని, అది కళాకారులకు మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్లు అభిప్రాయపడింది. జనవరి 11 వరకు నిలుపుదల చేస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
YSRCP: అధికారికంగా వైసీపీలో చేరిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ..ఆ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లే..?