YSRCP: గత కొంత కాలంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ, వైసీపీకి దగ్గరగా వ్యవహరిస్తూ వచ్చిన ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఇవేళ అధికారికంగా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంబటి రాయుడు గత కొంత కాలంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. వైసీపీ నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ వచ్చారు. రెండు మూడు పర్యాయాలు సీఎం జగన్ తో సమావేశం కూడా అయ్యారు. ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్ లు చేశారు.
దీంతో రాబోయే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చినా అధికారికంగా పార్టీలో చేరలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ కండువా కప్పుకోవడంతో రాబోయే ఎన్నికల్లో పోటీకి సై అన్నట్లు సంకేతాలు వచ్చినట్లు అయ్యింది. త్వరలో పార్టీ ఆయనకు ఇన్ చార్జి బాధ్యతలను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిప్యూటి సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
రాజకీయాల్లో సెకండ్ ఇన్సింగ్స్
వైసీపీలో చేరిన తర్వాత అంబటి రాయుడు మాట్లాడుతూ .. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని అన్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుండి తనకు జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని..ఆయన కులమతాలు, రాజకీయాలతో పని లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు తెలిపారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారనీ..ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని రాయుడు ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
Amit Shah: తెలంగాణ బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్న అమిత్ షా