TTD: టీటీడీ ఉద్యోగుల సంక్షేమం, ధార్మిక ప్రచారంలో వెనుకడుగు వేసే ప్రసక్తిలేదని పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమం గురువారం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగింది. టీటీడీ ఉద్యోగులకు భూమన తన చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఇంటి పట్టాలు అందించడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు.
17 సంవత్సరాల క్రితం తాను టీటీడీ ఛైర్మన్గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయమై చర్చించినట్లు చెప్పారు. తన ఒత్తిడి వల్లే ఉద్యోగులకు ఇంటిస్థలాలు మంజూరు చేసినట్లు 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే వేదిక మీద తెలియజేశారని గుర్తు చేశారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాను సంప్రదించినప్పుడు ఆయన ఉచితంగా ఇంటి స్థలాలు ఇద్దామని చెప్పారన్నారనీ, అయితే చట్ట ప్రకారం ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే నామమాత్రపు ధరతో ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని సాకారం చేయడంలో ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర కార్యనిర్వాహకవర్గం తనకు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించారని పేర్కొంటూ వారికి ఛైర్మన్ అభినందనలు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఉద్యోగులతో తమకున్న బంధాన్ని విడదీయలేరని కరుణాకర రెడ్డి అన్నారు. తాను పేరు కోసం కాకుండా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించానని చెప్పారు.
తాను రాజకీయాల్లో ఉండడం వల్లే ఎమ్మెల్యేగా, ఛైర్మన్ గా అయ్యానని, ఈ పదవులు రావడం వల్లే పేదల కోసం, ఉద్యోగుల కోసం తాను నిస్వార్ధంగా పని చేయగలుగుతున్నట్లు తెలిపారు. ఎన్నో ప్రభుత్వాలు ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయం గురించి చూస్తాం, చేస్తామని చెప్పారు కానీ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ననీ, ఈ విషయాన్ని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని భూమన కోరారు.
YSRCP: కళ్యాణదుర్గం నుండి మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుకొండకు షిప్ట్ .. రీజన్ ఏమిటంటే..?