YSRCP: రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇన్ చార్జిల మార్పులు, చేర్పులపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తొలుత 11 నియోజకవర్గాలకు కొత్తగా ఇన్ చార్జిలను నియమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు పూర్తి చేసినా అధికారికంగా ప్రకటించకుండా అభ్యర్ధులకు సమాచారం ఇస్తున్నారు. ఎవరెవరికి ఎక్కడికి మార్పు చేస్తున్నారు. ఎవరెవరికి టికెట్ ఇస్తున్నారు అనే విషయాలను నేరుగా వాళ్లకే తెలియజేస్తున్నారు.
నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాల కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ నేతల్లో వ్యతిరేకత ఉన్న వారిని వేరే నియోజకవర్గాలకు మార్పు చేయడమో లేక పక్కన పెట్టడమో చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు మార్పులు జరిగాయి. కళ్యాణదుర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ కు నియోజకవర్గ వైసీపీలో స్థానికుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. లోకల్ – నాన్ లోకల్ అనే నినాదాన్ని తీసుకువచ్చి ఉషశ్రీ చరణ్ నాయకత్వాన్ని గత కొంత కాలంగా వ్యతిరేకిస్తున్నారు. అసమ్మతి నేతలు సమావేశాలు నిర్వహించారు. లోకల్ నాయకులకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తేనే గెలిపిస్తామని హైకమాండ్ కు అల్టిమేటమ్ కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఉషశ్రీ చరణ్ ను రాబోయే ఎన్నికల్లో పెనుకొండ నుండి పోటీ చేయాలని ఆదేశించింది. నియోజకవర్గ మార్పు అంశాన్ని గురువారం మీడియా సమావేశంలో స్వయంగా మంత్రి ఉషశ్రీ చరణ్ యే వెల్లడించారు. ఉష శ్రీ చరణ్ నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ ను కలిసి మాట్లాడారు. ఇవేళ మీడియా సమావేశంలో మంత్రి ఉష శ్రీ చరణ్ మాట్లాడుతూ .. వచ్చే ఎన్నికల్లో తాను పెనుగొండ నుండి పోటీ చేస్తున్నానని తెలిపారు. పార్టీ అధిష్టానం నుండి తనకు పెనుకొండ నుండి పోటీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు.
అభ్యర్ధులను చూసి కాకుండా జగన్ ను చూసి మాత్రమే ఓట్లు వేస్తారని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగానే ఈ మార్పు జరిగిందని తెలిపారు. కళ్యాణదుర్గం స్థానాన్ని వాల్మీకి బోయలకు కేటాయించాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయం స్వాగతిస్తున్నానని మంత్రి చెప్పారు. జగన్ ఆదేశాలను తాను పాటిస్తానని అన్నారు. ఇన్ని రోజులు కళ్యాణదుర్గం ప్రజలు తనను ఎంతో ఆదరించారని, వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. తాము ఎక్కడికి వెళ్లినా..ఒక్కటే నినాదమని, అది జగన్ నినాదమని అన్నారు. ప్రజలు ఎక్కడైనా సరే జగన్ ని, ఫ్యాన్ గుర్తునే చూస్తున్నారని అన్నారు.
మరో పక్క మంత్రి ఉషశ్రీ చరణ్ ఈ ప్రకటన చేసిన వెంటనే పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ వర్గీయులు మండిపడుతున్నారు. ఉషశ్రీ వద్దు ..శంకరన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. శంకర నారాయణకు సీటు ఇస్తే గెలిపించుకుంటామని పేర్కొంటున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం శంకర నారాయణను మరో నియోజకవర్గానికి పంపుతున్నట్లుగా సమాచారం.