TTD: తిరుమలకు భక్తులు పోటెత్తారు. రోజుకు 20వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాల్సి ఉండగా రెండు రోజులుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయలేదు. దీంతో తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న మూడు కేంద్రాల వద్ద నేడు భక్తుల రద్దీ పెరగడంతో తోపులాట జరిగింది. రెండు రోజుల విరామం తరువాత తిరుమలలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు. భక్తుల తాకిడి ఎక్కువకావడంతో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగి ముగ్గురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని రూయా ఆసుపత్రికి తరలించారు.
TTD: భక్తుల ఆగ్రహం
టీటీడీ అధికారుల వైఖరిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తిరుమల చేరుకుని మూడు నాలుగు రోజులు అయినా టోకెన్లు ఇవ్వడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనం మంచినీళ్లు వంటి సదుపాయాలు లేక చిన్న పిల్లలతో ఇబ్బందులు పడాల్సి వస్తొందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇవ్వకపోయినా కొండపైకి అనుమతి ఇస్తే తలనీలాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకుంటామని పేర్కొంటున్నారు.
టోకెన్లు లేకుండానే అనుమతి
పరిస్థితులు గమనించిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్యూలైన్ లో ఉన్న భక్తులను టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ భక్తుల రద్దీ దృష్టి పెట్టుకుని అయిదు రోజుల పాటు వీఐపీ విరామ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. విరామ (బ్రేక్) దర్శనాల సమయంలోనూ సాధారణ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు టీడీపీ తెలిపింది. భక్తులు అందరూ సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతానికి సర్వదర్శన టికెన్ల జారీని నిలిపుదల చేసింది.