TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో మూడు రోజులు సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. సాధారణ భక్తులకు సులువుగా శ్రీవారి దర్శనం దొరకడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖల ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ మూడు రోజుల్లో అదనంగా శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇటీవల ట్రస్ట్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయం ద్వారా సామాన్య భక్తులు ఎక్కువ సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం టీటీడీ రోజుకు 30వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆ మూడు రోజులు టోకెన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మూడు రోజుల్లో వీఐపీలకు కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయిస్తారు.
TTD: దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
మరో పక్క టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు ఇచ్చే తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలన్న ఆలోచన లేదని ఆయన చెప్పారు. కేవలం సిఫార్సు లేఖల ఆధారంగా విచక్షణ కోటాలో వీఐపీలకు కేటాయించే సేవా టికెట్ల ధరల పెంపుపైనే చర్చ జరిగిందనీ, ఇంకా నిర్ణయం తీసుకోలేదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ధనవంతులకు ప్రయోజనాలను పరిరక్షించే కుట్రతోనే కొందరు పాలకమండలి చర్చను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలకమండలి సమావేశాలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.