కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ స్వరం పెంచుతోంది. ఇంతకు ముందు ఏనాడు కేంద్రంపై ఘాటు విమర్శలు చేయని వైసీపీ గత కొద్ది రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తొంది. రాష్ట్రాల అప్పులపై కేంద్రం పార్లమెంట్ లో వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేంద్రం కంటే ఏపి రాష్ట్ర అర్ధిక పరిస్థితే మెరుగ్గా ఉందంటూ వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. ఆనాడు మీడియా సమావేశంలో రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడే కేంద్రం వారి అప్పుల సంగతి ఏమిటి అని కూడా ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు తాజాగా రాజ్యసభలోనే కేంద్రంపై విమర్శలకు దిగారు. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కేంద్రం తీరుతో రాష్ట్రం వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని కూడా ఆరోపించారు విజయసాయిరెడ్డి.
ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్రం విఫలం
ద్రవ్యోల్బణం విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఉందన్నారు. రానున్న ఆర్ధిక సంవత్సరంలో కూడా ద్రవ్యోల్బణం ఆరు శాతం పైనే ఉంటుందని ఆర్ బీ ఐ ప్రకటించడం గమనార్హం అన్నారు. ఇతర దేశాల్లో ద్రవ్యోల్బణం రేటతో పోల్చుకుని మనం మెరుగైన స్థితిలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్యుడిప తీవ్రమైన ప్రభావం పడుతోందని పేర్కొన్న విజయసాయిరెడ్డి ..తగిన చర్యలు చేపట్టి ధరల పెరుగుదలను అదుపు చేయాలని సూచించారు.
రాష్ట్రాల ఆదాయాన్ని లూటి చేస్తున్న కేంద్రం
పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో ఏపికి నిర్ణయించిన వాటా మేరకు కేంద్రం ఇవ్వనందు వల్ల గత ఏడు సంవత్సరాల్లో రాష్ట్రం రూ.46వేల కోట్లు నష్టపోయిందని తెలిపారు విజయసాయిరెడ్డి. పన్నుల పంపిణీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి రూ.11.26 లక్షల కోట్లు నష్టపోయాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆదాయాన్ని లూటీ చేసిందని ఘాటుగా విమర్శించారు విజయసాయిరెడ్డి. సెస్, సర్ చార్జీలను ఏటా విధిస్తూ కేంద్రం రాష్ట్రాలను లూటీ చేస్తోందని అన్నారు. గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అనధికార మిత్ర పక్షంగా వ్యవహరిస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.