YS Jagan: ఏపీ సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఢిల్లీలోని ఏపి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ సతీమణి భావనా సక్సేనా ను రిలీవ్ చేస్తూ కేంద్రం నుండి తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. భవన సక్సేనా కేంద్ర సర్వీసుల్లో భాగంగ విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీగా నియమితులైయ్యారు.
సీఎంఓలో అన్నీ తన కనుసన్నల్లోనే నిర్వహించి
ప్రవీణ్ ప్రకాష్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఏపిలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఏపి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ తో ఏపికి వచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయనకు సీఎంఓలో అవకాశం దక్కింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ కీలక బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సీఎం వైఎస్ జగన్ కు అత్యంత ఇష్టమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. సీఎంఓ మొత్తం ఆయన కంట్రోల్ లో ఉండటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి తెలియకుండా జీవోలు విడుదల చేయడం, అన్నీ తానే అయి వ్యవహరించడంతో కొన్ని ఆరోపణలు సైతం వచ్చాయి. ఆ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ ను సీఎంఓ నుండి బదిలీ చేస్తారన్న ప్రచారం ప్రభుత్వ వర్గాల నుండి వచ్చింది.
YS Jagan: మరల ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్గా
ఆదిత్యనాథ్ దాస్ సీఎస్ గా ఉన్న సమయంలోనే ప్రవీణ్ ప్రకాష్ కు జీఏడీ పొలిటికల్ బాధ్యతల నుండి తప్పించారు. ఆయన పర్యవేక్షణలో ఉన్న కీలక శాఖలను సీఎం అదనపు కార్యదర్శి ముత్యాల రాజుకు అప్పగించారు. అప్పటి నుండి ప్రవీణ్ ప్రకాష్ సీఎంఓ సెక్రటరీగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ను ఆకస్మికంగా బదిలీ చేయడంతో సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరో పక్క ప్రవీణ్ ప్రకాష్ ఫ్యామిలీ ఢిల్లీలో ఉండటం వల్ల ఆయనే చాలాకాలంగా ఏపి భవన్ రెసిడెంట్ అధికారిగా వెళ్లాలని కోరుకుంటున్నారనీ, అందుకే ప్రభుత్వం బదిలీ చేసిందని అన్న ప్రచారం కూడా ఉంది. ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయిన నేపథ్యంలో సీఎంఓ కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, కెఎస్ జవహర్ రెడ్డి లలో ఒకరిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.