YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన చేశారు.
దేశమంతా ఇదే పరిస్థితి…
కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే తయారుచేసిన విషయం అందరికీ తెలిసినదే. కానీ 10వ తరగతి, 11–12వ తరగతి(ఇంటర్) పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటం వల్ల… ఈ విషయంలో జాతీయ విధానం అంటూ ఏదీ ప్రకటించకపోవటం వల్ల… జాతీయ విధానం అంటూ లేకపోవటం వల్ల, కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించేశారు. మరి కొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి పాస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు.
రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివిన విద్యార్థులకు మంచి మార్కులతో, గ్రేడ్లతో సర్టిఫికెట్లు వస్తాయి. మార్కులూ ర్యాంకులూ ఉన్న విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇంటర్ తరవాత పెద్ద చదువుల కోసం రాసే పోటీ పరీక్షకు కూడా ఇంటర్లో కనీసం ఇంత శాతం మార్కులు వచ్చి తీరాలన్న నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ పిల్లల కెరీర్ అవకాశాల పరంగా చూసినా, వారి భవిష్యత్ ఉద్యోగాల కోసం కూడా… ఇలా ఇంటర్ మార్కుల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రతి సందర్భంలోనూ పరీక్ష రాసి మంచి మార్కులతో, ర్యాంకులతో సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మార్కులే వారి పై చదువులు, ఉద్యోగావకాశాల పరంగా కీలకం అవుతాయి కాబట్టి పరీక్షలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
హైకోర్టు సూచనతో
పరీక్షల నిర్వహణ మీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షల వాయిదాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని తెలియజేశారు.