ZP Elections : ఏపిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలకు ఘర్షణలకు దిగుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణ పడుతున్నారు. నేతల నిర్బంధాలు, పలు గ్రామాల్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ కొనసాగుతోంది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచేపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ అభ్యర్థికి ఓట్లు వేయాలంటూ కాలనీల్లో యువకులు ప్రచారం చేస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాచేపల్లికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అఖిలప్రియను పోలీసులు ఆలయంలో నిర్బంధించారు. పోలీసుల తీరుపై అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా ఎ ఎన్ పేట మండలం పొనుగోడులో పరిషత్ ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. ఈ కేంద్రంలో రేపు రీపోలింగ్ నిర్వహించనున్నారు. గ్రామంలో ఓ వృద్దుడి ఓటు విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద గొడవ జరిగింది. వృద్ధుడితో ఓటు వేయించేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ సమయంలో బీజేపీ ఏజెంట్ ప్రసాద్ బ్యాలెట్ బాక్స్ ను ఎత్తుకుని వెళ్లి నీటితొట్టిలో వేసి పరారు అవ్వడంతో అధికారులు పోలింగ్ నిలిపివేశారు. తొలుత ప్రసాద్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులను తోసేసి బ్యాలెట్ బాక్స్ ను ఎత్తుకెళ్లాడు. బ్యాలెట్ బాక్స్ ను నీటి తొట్టెలో వేసిన అనంతరం ప్రసాద్ పరారైయ్యాడు.
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మముడూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రౌడీషీటర్లను వైసీపీ ఏజెంట్లుగా పెట్టారంటూ స్వతంత్ర అభ్యర్థి ఆరోపించడంతో ఘర్షణ చెలరేగింది. వైసీపీ ఏజెంట్లు అభ్యంతరం తెలిపిన మహిళా అభ్యర్థులపై దాడి చేశారు. ఈ ఘటనలో మహిళలకు గాయాలు అయ్యాయి. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడంతో తాత్కాలికంగా పోలింగ్ నిలిపివేశారు.
ప్రకాశం జిల్లా పామూరులో సీపీఐ ఎన్నికలను బహిష్కరించింది. పామూరు -2 ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ లో గుర్తులు తారుమారుపై సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. ఇక్కడి ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నది. ఈ ఆందోళన క్రమంలో జిల్లా సీపీఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణను పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం గొనెపూడిలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. పోలింగ్ కేంద్రం వద్ద భైటాయించి ఆందోళన చేశారు.
ZP Elections : రేపు రీపోలింగ్
విశాఖ జిల్లా పెద్దబయలు మండలం సీతగుంటలో అభ్యర్థి ఎన్నికల గుర్తు మారిందని ఆందోళన చేపట్టారు. బ్యాలెట్ పేపరులో గుర్తు మారిందని ఎంపీటీసీ అభ్యర్థి ఆందోళన చేశారు. సీపీఐ అభ్యర్థికి కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి (సీపీఎం) గుర్తు వచ్చిందని ఆందోళన చేశారు. దీంతో ఈ స్థానానికి రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట లో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపరులో తప్పులు ఉండటంతో పోలింగ్ రేపటికి వాయిదా పడింది. పోటీలో ఉన్న అభ్యర్థి పేరు బదులుగా నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థి పేరు బ్యాలెట్ లో ముద్రించారు. వైసీపీ అభ్యర్థి ఎస్ నిర్మల పేరు బదులుగా బ్యాలెట్ పేపరుపై ఎస్ లక్ష్మి పేరు ముద్రించి ఉంది. పేరు మార్పు గందరగోళం నేపథ్యంలో పోలింగ్ నిలిచిపోయింది.
విజయనగరం జిల్లా ద్వారపూడిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మద్య ఓటరు స్లిప్పులు పంపిణీ విషయంపై వివాదం తలెత్తింది. ఇరువర్గాలు తోపులాడుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడులో ఏజెంట్ల మద్య వివాదం నెలకొనడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది.
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం అంకాలగూడెం లో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఏకుల గడ్డియ్య గాయపడ్డారు. వైసీపీ వర్గీయులు దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నారు.
అనంతపురం ధర్మవరం మండలం రేగాటిపల్లి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన నాయకుడు మధుసూధనరెడ్డి ఇంటిపై వైసీపీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడటంతో కారు అద్దాలు పగిలాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రకాశం జిల్లా చెరుకూరు ఎంపిటీసీ 1 స్థానంలో పోలింగ్ నిలిచిపోయింది. ఈ పోలింగ్ కేంద్రానికి రావాల్సిన బ్యాలెట్ పత్రాలు అధికారులు వేరే కేంద్రానికి పంపించారు. దీంతో బ్యాలెట్ పేపర్లు లేకపోవడంతో పోలింగ్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కీళంబాకం, కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లె గ్రామ ప్రజలు పోలింగ్ ను బహిష్కరించారు. టీడీపీ ఈ ఎన్నికల బరిలో లేదన్న కారణంతో వీరు పోలింగ్ ను బహిష్కరించారు. చిత్తూరు జిల్లా గడిపాడు మండలం వేపాలమానుచేను గ్రామస్తులు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని పేర్కొంటూ ఓట్లు వేసేందుకు నిరాకరించారు. గ్రామాభివృద్ధి పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
కడప జిల్లా బద్వేల్ మండలం ఉప్పతివారిపల్లెలో టీడీపీ జడ్ పీ టీసీ అభ్యర్థి బీరం శిరీష నిరసనకు దిగారు. టీడీపీ ఏజెంట్ లను పోలింగ్ కేంద్రం నుండి బలవంతంగా బయటకు పంపారంటూ ఆమె ఆందోళనకు దిగారు రాజోలులో టీడీపీ అభ్యర్థి పోలింగ్ కేంద్రం నుండి బ్యాలెట్ పేపరు తెచ్చారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.