Corona second wave: కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని కాటేసింది. రోజుకి లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో ప్రజలు చనిపోతున్నారు. వీటన్నింటికంటే దయనీయంగా ఆస్పత్రిలో బెడ్ లు అందుబాటులో లేక ఆక్సిజన్ సదుపాయం లేక చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే దీనిపై మన భారత సెలబ్రిటీలు ఒక్కరూ ఎందుకు నోరు మెదపడం లేదు?
అప్పుడేమో #Indiagettogether
గతంలో రిహానా అనే హాలీవుడ్ పాప్ సింగర్ రైతులు కేంద్రానికి, కార్పొరేట్ లకు వ్యతిరేకంగా చేస్తున్న సమ్మె పైన స్పందించి ట్వీట్లు వేసింది. అంతే…. kanganaranaut మొదలుకొని విరాట్ కోహ్లీ వరకూ బాలీవుడ్ సెలబ్రిటీలు, భారత క్రికెటర్లు అంతా మనదేశ సమస్యను ఇతర దేశస్తులు ఎత్తి చూపాల్సిన అవసరం లేదు…, మనమంతా ఒకటే అని నిరూపిద్దాం… సామరస్యంగా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం అని ట్వీట్లు వేశారు. India get together, India against propaganda అనే హ్యాష్ ట్యాగ్ లతో తో వారు ఇండైరెక్టుగా ప్రభుత్వానికి, కార్పొరేట్లకు వత్తాసు పలికారు.
Corona second wave: ఇప్పుడేమో సైలెంట్
కట్ చేస్తే…. రెండవ కరోనా వేవ్ లో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ముందుచూపు లేక, సమయానుకూలంగా కఠిన నిర్ణయాలు తీసుకోలేక సేఫ్ గేమ్ ఆడుతున్న భారత దేశ ప్రభుత్వాన్ని మన దేశస్తులే తప్పు పడుతున్నారు. గట్టిగా మాట్లాడితే పనిగట్టుకొని తప్పుపట్టాల్సిన అవసరం లేదు… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కళ్ళముందే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఒక్క భారత సెలబ్రెటీ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ప్రజలందరితో కలిసి న్యాయం కోసం పోరాడడంలేదు. న్యాయం సంగతి పక్కనపెడితే తమ వంతుగా ఆక్సిజన్ సదుపాయాలు అందించడం, తమ పాపులారిటీతో జనాలకి ఉపయోగపడిన దాఖలాలు కూడా దాదాపు సున్నానే.
దారుణాల మధ్యే ఉంటూ….
ఫిలిం స్టార్లు తమ తోటి నటీనటులు కరోనా బారినపడి ఆస్పత్రి పాలవుతున్నా… ఎంతో మంది సీనియర్ నటులు చనిపోతున్నా… పెదవి విప్పడం లేదు. ఇక క్రికెటర్లలో చాలామంది కోవిడ్ బారినపడి టోర్నమెంట్ మొదట్లో మ్యాచ్ లకు దూరం అయ్యారు. విదేశీయులు అయితే భయపడి టోర్నమెంట్ నుండి పారిపోతున్నారు. అయినప్పటికీ ఒక్క క్రికెటర్ కూడా నోరు మెదపలేదు.
Corona second wave: ప్రజల మాటేంటి?
ఇప్పుడు ఈ విషయంపై విపరీతమైన చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. ఒక విదేశీ పాప్ సింగర్ ఒక్క ట్వీట్ వేసినందుకే రెచ్చిపోయిన మన భారత సెలబ్రిటీలు రాజకీయ వ్యవస్థ విఫలమై తమ స్వార్థం కోసం కరోనా వ్యాపిస్తున్న సమయంలో ఎలక్షన్ ర్యాలీలు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినప్పటికీ ఒక్కరు కూడా దీనిపై ప్రశ్నించపోవడంతో మన దేశంలో ఉన్న దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వీరి దగ్గరనుంచి బాధ్యత ఆశించడం మన అవివేకమే అనుకోవాలేమో…