Ration Dealers: ఇంటింటికీ రేషన్ Ration Dealers ఇంటింటికీ రేషన్.. జనవరి నెల నుంచి ఏపీలో ప్రారంభమైన కొత్త వ్యవస్థ. నిజానికి దేశంలోనే ఇటువంటి ప్రయోగానికి ఏపీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం భారీగా వాహనాలు కొనుగోలు చేశారు. రేషన్ కోసం ప్రజలు డిపో వద్దకు వెళ్లకుండా, లైన్లో నుంచోకుండా, శ్రమ లేకుండా ఇంటి వద్దే ప్రభుత్వం అందించే సరుకులు తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన. అయితే.. ఆలోచనను సక్రమంగానే గాడిలో పెట్టినా ఆచరణలో కొన్ని విమర్శలు తప్పలేదు. ఇదంతా పక్కనపెడితే ఇప్పటివరకూ రేషన్ ఇచ్చిన డీలర్ల పరిస్థితే ఇప్పుడు ఆందోళనలో పడింది. రేషన్ డోర్ డెలివరీ ప్రారంభించకముందు.. మీకేమీ నష్టం చేయం అని ప్రభుత్వం చెప్పింది. కానీ.. డీలర్లకు తమకు అన్యాయం జరుగుతోందనే అంటున్నారు.
తమకు ఇవ్వాల్సిన కమీషన్ ఇవ్వకుండా ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని వారంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. త్వరలో తమ సమస్యలపై హైకోర్టును ఆశ్రయించాలని ఆలోచన చేస్తున్నారట. పీడీఎఫ్ బియ్యం పంపిణీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాలు డీలర్లకు కమిషన్ చెల్లిస్తున్నాయి. ఇవి కాకుండా ఇతర నిత్యావసరాలు అమ్మినప్పుడు మరికొంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఇదంతా పోయింది. రాష్ట్రంలోని దాదాపు 29వేల మంది డీలర్లు మొత్తంగా ఈ మూడు నెలలకు కలిపి దాదాపు 200 కోట్ల నాన్ పీడీఎఫ్ ఆదాయం కోల్పోయినట్టు సమాచారం. ఇది కాకుండా ఆరు నెలల నుంచి ప్రభుత్వం డీలర్లకు చెల్లించాల్సిన 180కోట్ల కమిషన్ కూడా చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో తమ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయించారు.
ఇందుకు హైకోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రేషన్ ఇంటింటికీ డెలివరీలో కూడా ప్రజలు వాహనాల వద్దకే వచ్చి లైన్లో నిలబడుతున్నారు. దీంతో ఈ వ్యవస్థపై విమర్శలూ వస్తున్నాయి. ప్రతి ఇంటికీ, ఇరుకు సందుల్లోకి వాహనాలు వెళ్లలేక డోర్ డెలివరీ సాధ్యం కావడం లేదు. అలా కాకుండా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో ప్రారంభించి లోటుపాట్లను గుర్తించి ఉంటే డీలర్ల వ్యవస్థకు ఇబ్బందులు వచ్చేవి కావని చెప్పాలి. ఏదేమైనా ఉన్న వ్యవస్థలోనే కొత్త విధానం ప్రారంభమైంది. కానీ.. పాత వారితో కాదు. మరి.. దశాబ్దాలుగా డిపోలపైనే ఆధారపడిన వారి పరిస్థితి సందిగ్ధంలో పడటం బాధాకరమే..!