Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని విద్యా సంస్థలు క్లోజ్ చేయడం జరిగింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర లో కేసులు పెరుగుతూ ఉండటంతో పాటు దేశవ్యాప్తంగా చాలా చోట్ల కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. దీంతో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో స్కూల్స్ మరియు కాలేజెస్ క్లోజ్ చేసేసారు. ఇదిలా ఉంటే తెలంగాణ వైద్య శాఖ అధికారులు రాష్ట్రంలో థియేటర్లు కూడా క్లోజ్ చేస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారట.
ఇటీవల థియేటర్లలోకి వస్తున్న ప్రేక్షకులు మాస్కులు పెట్టుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించటం, కొత్త సినిమా రిలీజ్ అయితే దాదాపు 90% థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోవడంతో..ఏసీ వలన లోన థియేటర్ లో ఏ ఒక్కరికైనా కరోనా సోకితే అది అందరికీ అంటుకునే అవకాశం ఉందని తెలుపుతున్నారు. కాబట్టి థియేటర్లు క్లోజ్ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
ఒకవేళ థియేటర్లు మొత్తం క్లోజ్ చేయకపోయినా 50 శాతం మాత్రమే ఎంట్రీ ఉండే రీతిలో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని, కరోనా నీ అరికట్టడం జరుగుతుంది అని తెలంగాణ వైద్య శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తాజాగా తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో సినిమా థియేటర్ల విషయంలో తెలంగాణ సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది సస్పెన్స్ గా మారింది. మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొద్ది రోజుల్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.