ఇప్పుడేం చేయాలి..? కేంద్రం వద్దకు వెళ్లి బతిమలాడుకోవాలా…?? సుప్రీం కి వెళ్లి పంతానికి పోవాలా…?? నిమ్మగడ్డతో రాజీకి వెళ్ళాలా…? అసలు నిమ్మగడ్డ ఉన్నంత వరకు స్థానిక ఎన్నికలు ఆపెయ్యాలా…??? ఏం చేయాలి? జగన్ ఆలోచనలు ఇప్పుడు ఏమున్నాయి…? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సీఎం జగన్ లాంటి దూకుడు వ్యక్తిత్వం ఉన్న వారు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి ఆయన ముందున్న మార్గాలు చూద్దాం..! ఆసక్తికరమైన “న్యూస్ ఆర్బిట్ “మార్కు విశ్లేషణ.
సుప్రీం కి పకడ్బందీగా…!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు తీర్పు జగన్ కు అతి పెద్ద దెబ్బ. రమేష్ కుమార్ ని ఎలాగైనా తొలగించాలని ఆర్డినెన్స్, జీవో తీసుకురావడం…, కొత్త కమీషనర్ గా చెన్నై కి చెందిన కనగరాజ్ ని నియమించడం జరిగిపోయాయి. ఈ తరుణంలో హైకోర్టు తీర్పు సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రావడం ఆయనకు అతి పెద్ద దెబ్బ. ఇప్పటి వరకు వచ్చిన వ్యతిరేక తీర్పులు వేరు..? ఈ తీర్పు వేరు. అందుకే జగన్ అడుగులు, ఆలోచనలు ఎలా ఉంటాయనేది కీలకంగా మారింది. మొదటి అడుగు మాత్రం సుప్రీం కి వెళ్లడమే. కాస్త పకడ్బందీగా వ్యవహరించుకుని.., ఇదివరకే జడ్జిగా చేసిన కనగరాజ్ సలహా కూడా తీసుకుని, కీలకమైన న్యాయ అస్త్రాలు, చట్టాల పాయింట్లు పట్టుకుని సుప్రీం కోర్టుకి వెళ్లాలనేది జగన్ మొదటి మార్గంగా కనిపిస్తుంది.
కేంద్రం వద్దకు జాగ్రత్తగా…!
సుప్రీంకి వెళ్లినా ఉపయోగం లేదు అనుకుంటే.., అదే తీర్పు వస్తే మళ్ళీ తనకు ప్రతిష్ట భంగం అనుకుంటే నేరుగా కేంద్రం వద్దకు వెళ్లొచ్చు. బీజేపీ పెద్దల వద్దకు రాయబారం పంపి లేదా తనే వెళ్లి కలిసి… కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా విషయాన్ని నడిపించుకుని రావడం రెండో మార్గం. నిజానికి రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్రం పాత్ర, కేంద్ర ఎన్నికల సంఘం పాత్ర ఏమి ఉండవు.., కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కల్పించుకుంటాయి. సో… ఆ పరిస్థితిని రప్పించి, తెప్పించి… కేంద్ర ఎన్నికల సంఘం తలదూర్చేలా చేసి.., తనకు అనుకూల అధికారిని ప్రత్యేక అధికారిగా రప్పించుకుని స్థానిక ఎన్నికలు నిర్వహించడం. ఇది కొంచెం ఇబ్బంది కరమే. కేంద్ర పెద్దలు అంగీకరించాలి.. మళ్ళీ కోర్టు చిక్కులు ఎదురుకాకుండా ఉండాలి. సో… ఈ అడుగులు ఒక మార్గం మాత్రమే, జాగ్రత్తగా , వ్యూహాత్మకంగా వేస్తే జగన్ కి ఈ దారి దొరకొచ్చు.
నిమ్మగడ్డతో రాజీ ఫార్ములా…!
ఇది జగన్ వైఖరికి భిన్నం, అసలు ఆయనకు నచ్చదు కానీ… పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సిందే అనుకుంటే తలొంచాలి. నిమ్మగడ్డతో మనకెందుకు గొడవ అనుకుని రాజీకి వెళ్ళాలి. ఎన్నికల్లో జాగ్రత్తగా ఉంటామని చెప్పుకోవాలి. అసలే కులం పేరుతో, వ్యక్తిగతంగా కూడా నిమ్మగడ్డని జగన్ నానా మాటలూ అన్నారు. ఈ సమయంలో రాజీ అంటే జగన్ కి కష్టమే. కానీ విజయసాయిరెడ్డి , సజ్జల లాంటి వారు అందుకేగా జగన్ వెంట ఉన్నది. “జరిగిందేదో జరిగింది. మా వాడు ఫీల్ అవుతున్నాడు, ఎన్నికలు కాస్త చూసుకో..” అన్నట్టు నిమ్మగడ్డ దగ్గరకు వెళ్ళాలి. ఇది దాదాపు అసాధ్యమే. జగన్ వ్యక్తిత్వానికి ఇది పూర్తిగా వ్యతిరేకం కాబట్టి ఈ ఆలోచన చేయరు. ఒకవేళ అంత వరకు వెళ్లినా నిమ్మగడ్డ అంగీకరించకుంటే మళ్ళీ ప్రతిష్ట భంగం తప్పదు. అందుకే ఈ మార్గం రాసుకోడానికి , చెప్పుకోడానికి తప్ప అమలుకు చెల్లదు. అదే జగన్ స్థానంలో చంద్రబాబు ఉంటే “రాజీ ఫార్ములా” ప్రయోగించేవారు.
ఇక చివరిగా ఎన్నికల జోలికి వెళ్ళకుంటే…!
ఇక చివరిగా మరో అస్త్రం, ఆలోచన జగన్ ముందుంది. నిమ్మగడ్డతో గొడవ ఎందుకు వచ్చింది? “స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి”.. నిమ్మగడ్డని జగన్ పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? “స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి”…అసలు అవే లేకపోతే.. నిమ్మగడ్డతో జగన్ కి పనేముంది? నిమ్మగడ్డకి విలువ ఏముంది..? ఇప్పుడు చివరిగా జగన్ మదిలో ఈ ఆలోచన ఉన్నా ఆశ్చర్యం అవసరం లేదు. సుప్రీం వద్దు అనుకుంటే…, కేంద్రం అవసరం లేదు అనుకుంటే.., రాజీ వద్దే వద్దు అనుకుంటే… స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే చాలు. ఎలాగూ 50 % రిజర్వేషన్లు గొడవ ఉంది. దాన్ని సాకుగా చూపి, రిజర్వేషన్లు గొడవ తేలే వరకు ఎన్నికలు నిర్వహించలేం అంటూ కోర్టుకి చెప్పేసి… జాగ్రత్తగా వాదించుకుంటే నిమ్మగడ్డ అనే వ్యక్తిని జగన్ పట్టించుకునే అవసరమే లేదు. ఇది కూడా సీఎం జగన్ ప్రత్యామ్నాయ ఆలోచనగా ఉండే వీలుంది. మరో 20 నెలలు నిమ్మగడ్డ పదవీ కాలం ఉంది. అది ముగిసే వరకు ఎన్నికల తంతుని వాయిదా వేసుకుంటూ వస్తే తర్వాత తన అధికారిని తెచ్చుకుని నిర్వహించుకుంటే కలిసి వస్తుంది. అలా చేస్తే రెండున్నరేళ్ల తర్వాత తన బలం, పార్టీ బలం ఏంటి అనేది జగన్ కి అవగాహన ఉంటుంది.., 2024 నాటి సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు సంసిద్ధత ఉంటుంది. సో… ఈ నాలుగు మార్గాల్లో జగన్ ఏం ఆలోచిస్తారో చూద్దాం.