Nandi Awards: నంది అవార్డులు Nandi Awards సినిమా అవార్డులనేవి కళాకారులు, టెక్నీషియన్ల ప్రతిభకు గీటురాయిగా మిగులుతాయి. అందుకే సినిమా మేకింగ్ లో తాము పడ్డ కష్టానికి విలువ దక్కాలని ప్రతి నటుడు, టెక్నీషియన్ కోరుకుంటాడు. ఇది సహజం. ముఖ్యంగా తెలుగు సినిమాలకు ప్రకటించే నంది అవార్డులకు చాలా ప్రత్యేకత ఉండేది. ఎవరికైనా నంది అవార్డు వచ్చిందంటే వారి ప్రతిభను వేనోళ్ల పొగిడినట్టే. సినిమాలు ఫ్లాపైనా అవార్డులు వస్తే పొంగిపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే.. ఇటివల అవార్డులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో సినిమాలైతే విడుదలవుతున్నాయి కానీ.. అవార్డు ఫంక్షన్లు జరగడం లేదు. కొన్నేళ్ల క్రితం నంది అవార్డుల ఫంక్షన్ చాలా ఘనంగా జరిగేది. ఇప్పుడు కాస్త కళ తగ్గింది.
రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కూడా అవార్డులు ప్రకటిస్తున్నారు. కానీ.. వాటిపై అనేక వివాదాలు జరిగాయి. ముఖ్యంగా 2017లో ఏపీ ప్రకటించిన అవార్డులు అత్యంత వివాదాస్పదంగా మారాయి. టాలీవుడ్ వ్యక్తులు, అవార్డుల కమిటీ మెంబర్లపై కూడా విమర్శలు వచ్చాయి. కొందరికి అవార్డులు ఇచ్చుకున్నారని అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అయితే.. అవి ‘సైకిల్ అవార్డులు’ అని కూడా అనేశారు. దీంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నంది అవార్డులు అందుకోవాల్సి వారు అందుకోలేదు.. విమర్శలు ఎదుర్కొన్న అప్పటి ప్రభుత్వం అవార్డులు ప్రకటించినా ఇవ్వలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నంది పురస్కారాలపై ఎటువంటి ప్రకటనా లేదు.
దీంతో సినిమా వారికి ప్రైవేటుగా వచ్చే అవార్డులే దక్కుతున్నాయి. ప్రతి ఏటా ఫిలింఫేర్, సైమా, జీ సినిమా, సంతోషం.. వంటి వారు అవార్డులు ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రతి ఏటా జాతీయ అవార్డులను ఖచ్చితంగా ప్రకటిస్తోంది. వీటిలో కూడా అనేక వివాదాలు ఉంటున్నా.. ప్రస్తుతం ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛతో కొందరు చేస్తున్న కామెంట్లుగానే మిగిలిపోతున్నాయి. తెలంగాణలో ఆ ఊసే లేదు. ప్రస్తుత కరోనా సమయంలో అవార్డుల ప్రకటన గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయని చెప్పలేం. మరి రాబోయే రోజుల్లోనైనా తెలుగు సినిమాకు నంది అవార్డులు ప్రకటిస్తారా.. లేదంటే పూర్తిగా పక్కన పెట్టేస్తారా? అనేది చూడాలి.