కార్తీకమాసం శుద్ధ పంచమి. ఈరోజు చాలా విశేషమైనది. లక్ష్మీపంచమిగా పిలుస్తారు. ఈరోజు అలివేరు మంగతాయారు పుట్టినరోజు. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం…
స్థల పురాణం ప్రకారం భృగు మహర్షి ఆగ్రహంతో విష్ణుభగవానుడి హృదయం మీద తంతాడు… తన నివాస స్థలమైన ప్రదేశంలో తన్ని తనను తన భర్తను అవమానించినా… శ్రీహరి భృగు మహర్షిని ఏమీ అనకుండా మిన్నకుండడం.. శ్రీలక్ష్మీదేవికి అవమానంగా అనిపిస్తుంది.. అందుకే (పతికి / గురువుకీ అవమానం జరిగిన చోట ఒక్క క్షణం ఉండరాదని ధర్మం) బాధపడి పాతాళానికెళ్ళిపోయిందనీ, శ్రీ లక్ష్మీదేవిని తిరిగి చేరడానికి శ్రీమహావిష్ణువు చేసిన తపస్సుకు ఫలితంగా సువర్ణముఖరీ నదీతీరంలో (ఇప్పటి తిరుచానూరు ) లో ఉన్న పద్మ సరస్సులో ఉన్న పద్మాల మధ్యలోంచి సువర్ణపద్మంలోంచి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాడ నక్షత్రంలో అమ్మవారు తిరిగి ఆవిర్భవించి , కలువపూల దండలు స్వామికి సమర్పించి తిరిగి స్వామిని చేరిందని అలా ఒకరినొకరు అనుగ్రహించుకున్నారనీ స్థలపురాణంలో ప్రతీతి. పద్మ సరస్సు ఒడ్డున సూర్యభగవానుడు తపస్సు చేసిన స్థలం సూర్య ఆలయం ఇప్పటికీ మనం చూడవచ్చు. పంచమీ తీర్థోత్సవం అని తిరుచానూరులో ఇప్పటికీ ప్రత్యేక వైభవోత్సవం చేస్తారు.
అమ్మవారు అయ్యని తిరిగి చేరిన రోజు .. ఈరోజు అమ్మవారు , అయ్యవారలు పరమ కరుణాదృష్టితో ఉంటారు.. ఈ రోజు తిరుమల /తిరుచానూరు స్వామి వార్లను దర్శించడం చాలా ఉత్తమం….ఈరోజు తిరుమలనుంచి వచ్చే ప్రత్యేక సారెను ఏనుగులపై ఊరేగించి తీసుకొచ్చి అమ్మవారి(తిరుచానూరు)కి సమర్పిస్తారు .కార్తీక శుక్ల పంచమి రోజున లక్ష్మీ ప్రీతిగా లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా అర్చించటం విశేష అభిషేక అర్చనాదులు నిర్వహించడం పరిపాటి. లక్ష్మీ మంత్ర దీక్ష ఉన్నవారు ప్రత్యేకంగా ఈ రోజు అనుష్ఠానాదులు పెంచుకుంటారు. గురువుల అనుగ్రహంతో కొత్తగా ఆ దీక్ష తీసుకునేవారు కూడా ఈ నాడు తీసుకుంటూంటారు. తన ‘పతి’ ఏ చోట అవమానింపబడ్డాడో ఆ చోటు విడిచింది అమ్మవారు , అంటే ఆది లక్ష్మియైనా సరే పతినింద , గురునింద తట్టుకోలేదన్నమాట.
విష్ణుమూర్తే భృగుమహర్షితో అనునయంగా మాట్లాడినా తన భర్తకు జరిగిన అవమానాన్ని తాను భరించలేకపోయింది (మనకీ గురునింద వినరాదు , గురునింద జరిగేచోటునుండి వెంటనే వెళ్ళిపోవాలి అని శాస్త్రాలు / పెద్దలు చెప్తారు) కాబట్టి అయ్యవారిని విడిచి కాకుండా అమ్మవార్ని సంతుష్టురాల్ని చేయటానికి ’అయ్యవార్ని అమ్మవార్ని’ కలిపి పూజించండి. వీలైతే విష్ణు సహస్రనామం / గోవిందనామాలు పారాయణ చేసి అమ్మవారి అష్టోత్తరనామాలతో పూజించుకోవడం శ్రేష్ఠం. వేదాంతర్గత సూక్త పారాయణ చేయగలిగేవారు పురుషసూక్త , శ్రీ క్తపారాయణలు అర్చనలు చేసుకోవచ్చు. లేదా దేవాలయంలో దర్శనం చేసుకొని అర్చనాదులు చేయించుకోవడం ఉత్తమం. , ఇతర లక్ష్మీ దేవి స్తోత్రాలూ పూజలో అనుసంధానం చేసుకోవచ్చు.
ఇక ఈ పంచమిని జ్ఞాన పంచమి అని కూడా పిలుస్తారు , ఈ రోజు సుబ్రహ్మణ్యారాధన వలన జన్మ్యాంతరంలో సుబ్రహ్మణ్యానుగ్రహం వలన శుద్ధజ్ఞానం కలుగుతుందని నమ్మకం. ఇంతటి పవిత్రమైన ఈరోజు సద్వినియోగం చేసుకుని అమ్మవారి పూజ, ధ్యానం, సుబ్రమణ్య ఆరాధన చేయండి.