జ్యోతిర్లింగాలు అంటే తెలియని శివభక్తులు ఉండరు. జీవితకాలంలో ఒక్కసారైనా 12 జ్యోతిర్లింగాలను దర్శించాలని అనుకుంటారు శివభక్తులు. దేశంలో దాదాపు ఎక్కువ శాతం నదులు ఉత్తరం లేదా పశ్చిమాన పుట్టి తూర్పువైపునకు ప్రవహిస్తాయి. కానీ ఒక్క నర్మదా నది మధ్యభారతంలో పుట్టి పశ్చిమం వైపు ప్రయాణించి అరేబియాలో కలుస్తుంది. ఈ నర్మదా నది ప్రవాహం ఒక చిత్రమైనది. ఈ పవిత్రమైన నదీ తీరంలో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రమే ఓంకారేశ్వరం. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం….
మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఉజ్జయిని నుంచి సమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. నర్మదా నది ఇక్కడ రెండు పాయలు గా చీలి నర్మదా, కావేరిగా ప్రవహిస్తుంది. ఈ రెండు చీలికల మధ్యన ఉన్న ప్రాంతాన్ని శివపురి గా పిలుస్తారు. ఓంకారేశ్వర లింగానికి తల పైన ఉన్న చీలిక లో నుంచి అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్ర పరుస్తుందని భావిస్తారు. నర్మదా నది రెండు కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తుంటే పైన ఆకాశ౦ లో నుండి చూస్తే “ఓం” కారం రూపంలో ఈ నది కనిపిస్తుంది. అందుకే ఈ స్వామికి ఓంకారేశ్వరుడిగా పేరు వచ్చింది. ఓంకారేశ్వర ఆలయంలో ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాసారు. ఇక్కడ గౌరీ సోమనాధ మందిరంలో శివ లింగ దర్శనం చేస్తే పునర్జన్మ ఉంటుంది అని రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయని భక్తుల నమ్మకం. పవిత్రమైన నదీతీరంలో వెలసిన అత్యంత పవిత్రక్షేత్రం ఇది. దీని అవకాశం ఉన్నప్పుడు తప్పక దర్శించి శివానుగ్రహం పొందండి.