Akash Puri: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆకాష్ పూరి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2015లో ఆంధ్రా పోరి మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయినా.. నటుడిగా ఆకాష్ మంచి మార్కులే వేయించుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆకాష్ పూరి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అయింది.
ఓ పొలిటికల్ లీడర్ మనవరాలితో ఆకాష్ పూరి ప్రేమలో పడ్డాడని.. త్వరలోనే ఆమెతో పెళ్లి పీటలెక్కబోతున్నాడని వార్తలు వచ్చాయి. వీరి పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని కూడా ప్రచారం జరిగింది. దీంతో చిన్న వయసులోనే ఆకాష్ పెళ్లికి రెడీ అయిపోయాడా అంటూ నెటిజన్లు ఆశ్యర్యపోయారు. అయితే ఈ విషయంపై ఆకాష్ పూరి ఫస్ట్ టైమ్ నోరు విప్పాడు. అసలు నిజం ఏంటో బయటపెట్టాడు.
ఆకాష్ పూరి తాజాగా ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్కు అంబాసిడర్గా మారాడు. ఆకాష్ చేస్తున్న ఫస్ట్ బ్రాండింగ్ ఇదే. ఈ నేపథ్యంలోనే మార్చి 10న సదరు కంపెనీ వారు ఓ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులు రమేష్, రోమన్తో కలిసి ఆకాష్ పూరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాష్ తన కెరీర్ గురించే కాకుండా రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడాడు.
తన గత చోర్ బజార్ అంతగా ఆదరణ పొందలేదు. అందుకే ఈసారి తాను చేసే సినిమాను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని అనుకుంటున్నానని ఆకాష్ తెలిపాడు. ఓ లవ్ స్టోరీ, మరో యాక్షన్ మూవీ కథలు విన్నానని.. అవి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. అలాగే రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నానని, ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదని వెల్లడించాడు. పొలిటికల్ లీడర్ మనవరాలిలో ప్రేమాయణం, త్వరలోనే పెళ్లి అంటూ వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని పరోక్షంగా ఆకాష్ స్పష్టం చేశాడు.