ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ సమావేశంలో చట్టాలను ఉపసంహరించుకొనున్నట్లు తెలిపారు.
నూతన వ్యవసాయ చట్టాలను కొందరు ఆమోదించినప్పటికీ మరికొందరు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మోడీ తెలియజేశారు. ఈ సందర్భంగా మన రైతాంగానికి క్షమాపణలు చెప్పారు. పార్లమెంట్లో ఈ చట్టాలు చేసిన నాటి నుండి ఢిల్లీ సరిహద్దు లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు, బంద్, నూతన కార్యక్రమాలు జరిగాయి. మోడీ ఈ ప్రకటన చేయడంతో రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సంఘటిత పోరాట విజయంగా పేర్కొంటున్నారు.