Breaking: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న డిల్లీ యూనివర్శిటీ డాక్టర్ సాయిబాబా విడుదలకు సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. సాయిబాబాతో సహా ఆరుగురు నిందితులను నిర్దోషులుగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ప్రత్యేక ధర్మాసనం నిలుపుదల చేసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్ పూర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్ సాయిబాాబాతో పాటు మరో అయిదుగురు నిర్దోషులుగా బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తీర్పు ఇచ్చి తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వేరే ఏదైనా కేసులో వీరు నిందితులుగా ఉంటే మినహా వీరందరినీ తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణపై 2014 మే నెలలో సాయిబాబా, ఓ పాత్రికేయుడు, జవహార్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్ధి సహా మరి కొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ తర్వాత 2017 మార్చిలో నిందితులకు సెషన్స్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పటి నుండి వీరు నాగ్ పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న వీరు సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ధర్మాసనం విచారణ జరిపింది. వీరందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ నిన్న కీలక తీర్పు వెల్లడించింది. 2014 లో సాయిబాబా అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ యూనివర్శిటీ ఆయనను సస్పెండ్ చేసింది. గత ఏడాది ఆయనను సర్వీస్ నుండి పూర్తిగా తొలగించింది. అయితే బాంబే హైకోర్టు తీర్పును ఎన్ఐఏ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నట్లు తొలుత తెలిపింది. అయితే సీజేఐ జస్టిస్ లలిత్ తో చర్చలు జరిపిన తర్వాత జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం .. ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరమైనదిగా భావించింది. ఈ పిటిషన్ ను శనివారం విచారించేందుకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా త్రివేదీ లతో కూడిన బెంచ్ ను ఏర్పాటు చేసింది. ఎన్ఐఏ పిటిషన్ ను అత్యవసర విచారణ జరిపిన ఈ ప్రత్యేక ధర్మాసనం .. బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. దీంతో ప్రొఫెసర్ సాయిబాబా విడుదలకు బ్రేక్ పడింది.