తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ అందించారు. 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఏపికి జీఎస్టీ పరిహారం కింద రూ.689 కోట్లు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి రూ.1265 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. శనివారం నుండి జీఎస్టీ బకాయిలను చెల్లిస్తామని చెప్పామనీ, జీఎస్టీ పరిహారం మొత్తం పెండింగ్ బ్యాలెన్స్ జూన్ వరకూ రూ.16,982 కోట్లు క్లియర్ చేశామని అన్నారు.

మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 49వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూపీ సహా పలు రాష్ట్రాల్లో లభించే రాబ్ (ద్రవ బెల్లం), పెన్సిల్ షార్ప్ నర్లపై పన్ను రేటు ను తగ్గించారు. వార్షికాదాయానికి సంబంధించిన రిటర్నుల ఫైలింగ్ ఆలస్యంపై విధించే ఫీజును హేతుబద్దీకరించారు. గుట్కా పాన్ మసాలా పరిశ్రమలు పన్ను ఎగవేత, జీఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటుకు సంబంధించి రెండు వేర్వేరు మంత్రివర్గ ఉప సంఘాలు సమర్పించిన నివేదికలను స్వల్ప మార్పులతో ఈ సమావేశం ఆమోదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలో వీటిని సభ్యుల అభిప్రాయాల కోసం పంపనున్నామని, అనంతరం చైర్మన్ ఆమోదించనున్నట్లు ఆర్దిక శాఖ తెలిపింది.
ద్రవ బెల్లానికి సంబంధించి జీఎస్టీ రేటును 18 శాతం నుండి సున్నాకు తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బెల్లాన్ని ప్యాకింగ్ చేస్తే 5 శాతం, విడిగా విక్రయిస్తే ఎలాంటి పన్నూ ఉండదని తెలిపారు. పెన్సల్ షార్ప్ నర్ లపై 18 శాతంగా ఉన్న పన్నును 12 శాతానికి చేరుస్తున్నామన్నారు. 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీఆర్ – 9 దాఖలు విషయంలో ఆలస్య రుసుము హేతుబద్దీకరించారు. రూ.5 కోట్ల వరకూ ఆలస్య రుసుమును రోజుకు రూ.50లుగానూ, రూ.50 – 20 కోట్ల వరకు టర్నోవర్ కల్గిన వారికి రోజుకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు., ప్రస్తుతం ఈ ఫీజు రూ.200లుగా ఉంది.