Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్ వి రమణ) శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఎన్ వి రమణకు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వ్యక్తిగత ఖాతాలు లేవు,. అయితే గుర్తు తెలియని వ్యక్తులు జస్టిస్ ఎన్ వి రమణ పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా సృష్టించి పోస్టులు పెడుతున్నారు. గత రాత్రి ఈ ఖాతా నుండి చేసిన ఓ పోస్టు వివాదాస్పదంగా ఉండటంతో జస్టిస్ ఎన్ వి రమణ దృష్టికి వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన జస్టిస్ రమణ తన పేరుతో నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నెరిపిన దౌత్యంతోనే భారత్ కు అమెరికా ముడి పదార్ధాలు పంపాలని నిర్ణయించుకుంది అంటూ పిఎంఒకు ట్యాగ్ చేస్తూ ఆ నకిలీ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. కోవిషీల్డ్ టీకా తయారీకి కావాల్సిన ముడి పదార్ధాల ఎగుమతులపై నిషేదం ఎత్తివేస్తూ ఆమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలవా ఇప్పటి వరకూ 98 సార్లు ఈ నకిలీ ఖాతా నుండి వివిధ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. జస్టిస్ ఎన్ వి రమణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నకిలీ ట్విట్టర్ ఖాతాను తొలగించారు. దీనిపై పోలీసులు ధర్యాప్తు జరుపుతున్నారు.