Maharashtra: ఓ పక్క కరోనా మహమ్మారి నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆసుపత్రిల్లో చేరుతున్న బాధితులకు అక్కడా ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది. ప్రాణ వాయువు అందక పలు ఆసుపత్రుల్లో రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఆసుపత్రులకు ఆక్సిజన్ సమస్య కొంత వరకు పరిష్కారం అయ్యింది. మరో పక్క ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాద ఘటనలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. తాజాగా మరో ఘోర విషాదకర ఘటన మహారాష్ట్రలోని థానేలోని ప్రైవేటు ఆసుపత్రిలో నేటి తెల్లవారుజామున జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు రోగులు మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి మంటలను అదుపు చేశారు.
థానేలోని ప్రైమ్ క్రిటికల్ ఆసుపత్రిలో ఈ తెల్లవారుజున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది పేషంట్స్ ను మరో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ జితేంద్ర అవహద్ ఆసుపత్రి వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు దర్యాప్తును జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలోని వేదాంత్ ఆసుపత్రిలో అక్సిజన్ కొరత కారణంగా అయిదుగురు కరోనా బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే.