Modi: మోడీ సర్కార్ మరో కీలక సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటరు ఐడిని ఆధార్ తో అనుసంధానం చేయాలని 2022 ఎన్నికలకు ముందే ఎన్నికల సంఘం (ఈసీ) సిఫార్సు చేసింది. ఈసీ సిఫారసులతో పాటు పలు కీలక సంస్కరణలకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. వచ్చే ఏడాది యూపీతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోడీ సర్కార్ ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం విశేషం. ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం చేయడంతో పాటు, పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు బుధవారం కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో భాగంగా నాలుగు ఎన్నికల సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే ఓటర్ ఐడి లేదా ఎలక్టోరల్ కార్డ్తో ఆధార్ కార్డ్ సీడింగ్ను అనుమతిస్తారు. అయితే ఇది స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది.
Modi: ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ ఏ ప్రదేశాన్ని అయినా స్వాధీనం చేసుకోవచ్చు
ఈ కీలక ఎన్నికల సంస్కరణలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. 2022 జనవరి నుండి 18 ఏళ్లు నిండిన మొదటి సారి ఓటర్లు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో ఏడాదికి నాలుగు సార్లు ఓటును నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది ఇంతకు ముందు ఏడాదికి ఒక సారి మాత్రమే అవకాశం ఉండేది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు ఓటర్లుగా భర్త పని చేసే ప్రాంతంలో జీవిత భాగస్వాములు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఇక మీదట మహిళా ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా భార్య పనిచేసే ప్రాంతంలో సర్వీసు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరో కీలక అంశం ఏమిటంటే ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రదేశాన్ని అయినా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను ఈసీకి ఇచ్చింది. ఎన్నికల సమయంలో పాఠశాలలు, ఇతర ముఖ్యమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై ఇది వరకు కొన్ని అభ్యంతరాలు వస్తుండేవి.