కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, శశి ధరూర్ సహా ఆ కాంగ్రెస్ పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తొలుత పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి నిరసనగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు పార్లమెంట్లో నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు. దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గందరగోళం నేపథ్యంలో సభా కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వెలుపల జరిగిన ఎంపీలు నిర్వహించిన కార్యక్రమంలో సోనియా గాంధీ పాల్గొన్నారు.
అనంతరం రాహుల్ గాంధీ తో సహా ఎంపీలు, నేతలు రాష్ట్రపతి భవన్ దిశగా దూసుకుపోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, శశిధరూర్, ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు వ్యాన్ ఎక్కించి తరలించారు. పారా మిలటరీ దళాలు, ఢిల్లీ పోలీసులు విజయ్ చౌక్ రోడ్డును బ్లాక్ చేశారు. పార్లమెంట్ నుండి రాష్ట్రపతి భవన్ మార్గంలో బారికేడ్లు పెట్టారు. కాంగ్రెస్ ఎంపీల నిరసన ప్రదర్శనను నిలువరించడానికి మహిళా పోలీసులను సైతం రంగంలోకి దించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ .. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. మన దేశం ఇప్పుడు నలుగురు వ్యక్తుల నియంతృత్వంలో ఉందని విమర్శించారు.