Supreme Court: సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తరువాత న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకున్న జస్టిస్ ఎన్ వి రమణ తాజాగా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో బెయిల్ లభించిన వెంటనే విచారణ ఖైదీలు ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా జైలు నుండి విడుదల కావచ్చు. సహజంగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది అంటే నిందితుడు జైలులో ఉండాల్సిన అవసరం లేదు. కానీ బెయిల్ మంజూరు అయినా అందుకు సంబంధించిన పత్రాలు కోర్టు నుండి జైళ్ల శాఖకు అందలేదన్న సాకుతో విచారణ ఖైదీలు రోజుల తరబడి జైలులోనే ఉంటున్నారు.
Read More: AP High Court: అదేశాలు అమలు చేయని అధికారులకు షాక్ల మీద షాక్ లు ఇస్తున్న ఏపి హైకోర్టు..
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. బెయిల్ లభించినా విచారణ ఖైదీల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ జస్టిస్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు వ్యవస్థల మధ్య సమాచార పంపిణీలో జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ తరహా పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకుండా ధర్మాసనం ఓ నూతన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఫాస్టర్ పేరిట ఓ కొత్త వ్యవస్థను తీసుకువస్తున్నామని, దానితో ఇకపై బెయిల్ లభించిన విచారణ ఖైదీలు క్షణాల్లో జైలు నుండి విడుదల అవుతారని ధర్మాసనం తెలిపింది.
ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డు (ఫాస్టర్) ద్వారా ఇకపై తీర్పులు, ఉత్తర్వులు తక్షణం అధికారులకు చేరతాయి. ఈ ఫాస్టర్ వ్యవస్థకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టు ను 15 రోజుల్లోగా రూపొందించాలనీ, నెల రోజుల్లోగానే దీన్ని అమల్లోకి తీసుకుని రావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ రిజిస్ట్రీని ఆదేశించారు.