మహారాష్ట్రలోని శివసేన పంచాయతీకి సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే వర్గానికి సుప్రీంలో ఊరట లభించింది. శివసేన తిరుగుబాటు నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఆయన వర్గానికి అసలైన శివసేన గుర్తింపు ఇవ్వరాదని ఎన్నికల సంఘానికి సుప్రీం ఆదేశించింది. అంతే కాకుండా సోమవారం (ఆగస్టు 8న) ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు రాజ్యాంగపరమైన బెంచ్ కు సిఫార్సు చేయాలా వద్దా అనే విషయంపై సుప్రీం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపింది.
సుప్రీం కోర్టులో గురవారం వాదనల సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ .. శిండే వర్గాన్ని ఉద్దేశించి కీలక ప్రశ్నలను సంధించారు. మీరు ఎన్నికైన తరువాత రాజకీయ పార్టీలను పూర్తిగా విస్మరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా అని తెలుసుకోవాలని ఉందని శిందే తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను ఉద్దేశించి ప్రశ్నించారు. దీనికి ఆయన లేదు అనే సమాధానం ఇచ్చారు. రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారం తేలే వరకూ ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఉద్దవ్ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆభ్యర్ధించగా, రాజ్యాంగ బద్దమైన ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున తమనే అసలైన వర్గంగా గుర్తించాలని, ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని శిండే వర్గం వాదనలు వినిపించింది.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. శిండే వర్గం పిటిషన్ పై ప్రతికూలంగా స్పందించింది. శివసేన నియంత్రణను శిండే వర్గానికి అప్పగించవద్దని ఈసీకి సూచించింది. ఎవరిది అసలైన శివసేన అనేది తేల్చేందుకు ఆగస్టు 8 (సోమవారం) వ తేదీ లోపు ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఇది వరకే ఇరువర్గాలకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తాజా ఉత్తర్వులతో ఉద్దవ్ వర్గానికి ఊరట లభించింది.