భారత 16వ ఉప రాష్టపతిగా ఎన్డీఏ అభ్యర్ధిగా రంగంలోకి దిగిన జగ్ దీప్ ధన్ ఖడ్ విపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఉప రాష్ట్రపతి గా ఎన్నికైన జగ్ దీప్ ధన్ ఖడ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలియజేశారు. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 725 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా జగదీప్ ధన్ ఖడ్ కు 528 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్ధి మార్గరేట్ అల్వాకు కేవలం 182 మంది సభ్యులు మాత్రమే ఓటు వేశారు. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు. 55 మంది సభ్యులు పోలింగ్ కు దూరంగా ఉన్నారు.
లోక్ సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల బలం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే పార్టీ స్టాండ్ కు భిన్నంగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు శశిర్ అధికారి, దిబ్వెందు అధికారి పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ విప్ జారీ చేసే అవకాశం లేనందున వీరు పార్టీ స్టాండ్ కు భిన్నంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ఇద్దరు బీజేపీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరిగింది.
జగ్ దీప్ ధన్ ఖడ్ కు శుభాకాంక్షలు
ఉప రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన జగ్ దీప్ ధన్ ఖడ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్ షా తదితరులు జగ్ దీప్ ధన్ ఖన్ నివాసానికి చేరుకుని వెళ్లి అభినందనలు తెలియజేశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేయారు. కాగా ఉమ్మడి విపక్షాల అభ్యర్ధి గా పోటీ చేసి ఓడిపోయిన మార్గరేట్ అల్వా తన ఓటమిని అంగీకరిస్తూ జగ్ దీప్ ధన్ ఖడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ధన్ ఖన్ కు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు.