అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డీఐఈటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్ధులు శుక్రవారం అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో స్నానాలకు దిగారు. సముద్రంలో అలల తాకిడికి ఏడుగురు విద్యార్ధులు గల్లంతు అయ్యారు. మిగిలిన ఎనిమిది మంది విద్యార్ధులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. విద్యార్ధులు గల్లంతైన విషయాన్ని వెంటనే అధికారులకు సమాచారం అందించగా కోస్ట్ గార్డ్స్, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గుడివాడ పవన్ కుమార్ మృతదేహం లభ్యమైంది. సూరిశెట్టి తేజ అనే విద్యార్ధిని జాలర్లు రక్షించారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన అయిదుగురు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన విద్యార్ధులను గోపాలపట్నంకు చెందిన జగదీశ్, నర్సీపట్నంకు చెందిన జశ్వంత్. మునగపాడుకు చెందిన గణేశ్. ఎలమంచిలికి చెందిన రామచందు,. గుంటూరు వాసి సతీష్ గా నిర్ధారించారు.
ఈ విషాద ఘటనపై జిల్లా మంత్రి గుడివాడ అమరనాథ్ వెంటనే స్పందించారు. గల్లంతైన విద్యార్ధుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్,. ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. విషయంపై ఆరా తీసిన సీఎం జగన్ .. తక్షణమే సహాయ చర్యలు పర్యవేక్షించాలని మంత్రి అమరనాథ్ కు ఆదేశించారు. బాదిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.