విజయవాడ, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ శాతం పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తుందని అంబటి అన్నారు. మే 23న చంద్రబాబు మాజీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఈవిఎంలు సరిగా పనిచేయలేదని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈవీఎంలు పని చేయకపోతే పోలింగ్ శాతం ఎలా పెరిగిందని అంబటి ప్రశ్నించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఈవిఎంలతో గెలవలేదా, ఈ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబుకు ఈవిఎంలు పనికి రాలేదా అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మే 23న తెలుస్తోందని అంబటి పేర్కొన్నారు.
అధికారం పోతుందన్న ఆలోచనే చంద్రబాబును భయపెడుతోందని అన్నారు. ఆయనకు గెలుస్తామన్న విశ్వాసం ఉంటే భయమెందుకు అని అంబటి ప్రశ్నించారు. ఓటమి భయంతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చూస్తున్నారనీ. చాలాచోట్ల తమ పార్టీ నేతలపై టిడిపి నేతలు దాడులు చేశారని అంబటి అరోపించారు. టిడిపి నేతలే దాడులు చేసి తిరిగి వైసిపి నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని అంబటి అన్నారు.
కోడెల శివప్రసాదరావుపై తమ పార్టీ కార్యకర్తలు దాడి చేయలేదని అంబటి స్పష్టం చేశారు. ఆయన బూత్లోకి వెళ్లి దౌర్జన్యం చేయడంతో ప్రజలు తిరగబడ్డారని అంబటి తెలిపారు.
మంగళగిరిలో కూడా లోకేష్ ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారని అంబటి అన్నారు.