వైసిపి అధినేత జగన్ ఒకవైపు అసెంబ్లీ.. ఇటు పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 60కు పైగా నియోజకవర్గాలలో సమన్వయకర్తలను మార్చేశారు. కొంతమంది సమన్వయకర్తలకు స్థానాచలనం చేశారు. ఇలాంటి మార్పులు 60 కు పైగానే జరిగాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి చేరింది నెల్లూరు జిల్లాలోని కందుకూరు. ప్రస్తుతం ఇక్కడ నుంచి వైసీపీ తరపున మాజీ మంత్రి, సీనియర్ నేత మానుగుంట మహీధర్రెడ్డి ప్రాధినిత్యం వహిస్తున్నారు.
అయితే జగన్ ఈ సారి కందుకూరు సీటును బీసీలకు ఇవ్వాలని భావించారు. ఈ క్రమంలోనే మహీధర్రెడ్డిని తప్పించి కొండపి నియోజకవర్గంకు చెందిన యాదవ సామాజిక వర్గం నేత బోట్ల రామారావు యాదవ్కు సీటు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆర్థిక, అంగ బలాలతో పాటు లోకల్ నేపథ్యంలో రామారావు అయితే గట్టి పోటీ ఇవ్వలేడని భావించి ఆయన్ను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సారి ఓ లేడీ ఇక్కడ వైసీపీ నుంచి తెరమీదకు రావడం విశేషం.
ఈసారి కందుకూరు నుంచి వైసీపీ తరఫున ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ అధిపతి డాక్టర్ వి.పెంచలయ్య కుమార్తె ఐశ్వర్య పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఐశ్వర్య బీసీ సామాజికవర్గానికి చెందినవారు. వీరికి నెల్లూరు జిల్లా గూడూరులో ఆదిశంకర కాలేజ్ ఉంది. ఈ మేరకు జగన్ సమక్షంలో డాక్టర్ వి. పెంచలయ్య వైసీపీలో చేరారు. పెంచలయ్యతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు వి.అరవింద, డాక్టర్ వి.ఐశ్వర్య కూడా పార్టీలో చేరారు. మహీధర్ రెడ్డి ప్రోత్సాహంతోనే వీరు వైసీపీ కండువా కప్పుకున్నారు.
కందుకూరులో వైసీపీ జెండా ఎగరాలంటే బలమైన క్యాండెట్ ఉండాలని మహీధర్ రెడ్డి భావిస్తున్నారు. నాన్ లోకల్ క్యాండెట్లతో పాటు అంత బలం లేని వాళ్లకు ఇస్తే సీటు పోయే ప్రమాదం ఉందని గ్రహించే మహీధర్ రెడ్డి చక్రం తిప్పి పెంచలయ్య ఫ్యామిలీని వైసీపీలో చేర్పించారని ప్రచారం జరుగుతోంది. ఇక కందుకూరు చరిత్రలోనే ఓ ప్రధాన పార్టీ ఫస్ట్ టైం బీసీలకు సీటు ఇస్తోంది. ఇది కూడా ఇక్కడ పొలిటికల్ వాతావరణం వైసీపీకి అనుకూలంగా కనిపిస్తోంది.