ఏపీలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపైనే అన్ని పార్టీలు మెయిన్గా దృష్టి సారిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నానుడి ఉంది. కూటమి బాగా వర్కవుట్ అయితే ఈ రెండు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూటమి స్వీప్ చేసేస్తుందన్న అంచనాలు ముందునుంచే ఉన్నాయి. కానీ వాస్తవంగా ఇక్కడ కూటమి మధ్య సఖ్యత సెట్ అయ్యేలా లేదు. సీట్ల పంపకాలతో పాటు పోటీ చేసే సీట్ల విషయంలో రెండు పార్టీల నేతలు పంతాలకు పోతున్నారు.
ఒక సీటును టీడీపీ కాదని జనసేనకు ఇస్తే టీడీపీ వాళ్లు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అలాగే కొన్ని చోట్ల టీడీపీ వాళ్లకు సీట్లు ఇస్తే జనసేన సపోర్ట్ చేసే పరిస్థితి. రెండు పార్టీల గొడవల మధ్యలో వైసీపీ లాభపడుతుందా ? అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 19 అసెంబ్లీ, మూడు పార్లమెంటు సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేయడంతో జనసేన భారీగా ఓట్లు చీల్చడంతో టీడీపీ ఓడిపోయింది.
ఇక రాష్ట్రం మొత్తం మీద జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు కూడా .. ఇక్కడే ఉంది. ఈ సారి తన బలం వాడుకుని ఇక్కడ జనసేన సగం సీట్లలో పోటీ చేయాలని ఆశపడుతోంది. కానీ టీడీపీ అన్ని సీట్లు ఇచ్చేలా లేదు. ఇవ్వకపోతే జనసేన కేడర్ సహకరించే పరిస్థితి కనపడడం లేదు. ఇదంతా గందరగోళంగా కనిపిస్తోంది. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ దాదాపు ఆరేడు సీట్లను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కేటాయించాలని టిడిపి ముందు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
రాజోలు, రాజానగరం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వీటికి తోడు కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమహేంద్రవరం రూరల్, ముమ్మిడివరం, అమలాపురం లేదా పి.గన్నవరం సీట్లు ఈ లిస్టులో ఉన్నాయి. ఇక రామచంద్రాపురం లాంటి చోట్ల కూడా జనసేన అభ్యర్థులు తామే పోటీ చేస్తామంటున్నారు. జనసేన ఇన్ని సీట్లు అడుగుతుండగా.. ఇక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఉదాహరణకు రాజమండ్రి రూరల్ టీడీపీ సిట్టింగ్ సీటు. ఇక్కడ నుంచి పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు.
రాజానగరంలో పార్టీ కీలక నేత బొడ్డు వెంకటరమణ చౌదరి పోటీకి రెడీ అవుతున్నారు. ఆయనకు రాజమండ్రి ఎంపీ సీటు దక్కే ఛాన్సులు లేవు. దీంతో ఆయన ఖచ్చితంగా రాజానగరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బలంగా ఉన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చురుగ్గా ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ సీటు జనసేన అడుగుతోంది. ఇది జనసేనకు ఇస్తే వర్మ రెబల్గా పోటీ చేస్తారంటున్నారు. అది అంతిమంగా కూటమికే నష్టం జరుగుతుంది.
రామచంద్రాపురం, కొత్తపేట లాంటి చోట్ల కూడా అటు జనసేన, ఇటు టీడీపీ రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఏదేమైనా బలమైన ఈ జిల్లాలో రెండు పార్టీల మధ్య పొత్తు సరిగా సెట్ అయితే కూటమి డామినేషన్ స్పష్టంగా ఉంటుంది. తేడా వస్తే మాత్రం పొత్తు చిత్తవ్వనుంది.