ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ లకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. జూన్ నెలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులు జరగని విషయం తెలిసిందే.
శాసన మండలిలో ద్రవ్యవినిమయ బిల్లుకు టీడీపీ అడ్డుపడటంతో ఉద్యోగులకు ఈ నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రులు టీడీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడానికి కారణం టీడీపీయే అంటూ వైకాపా నేతలు ఆరోపించారు. అయితే మంత్రుల వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. దీనిపై వైకాపా, టీడీపీ ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టకుండా అధికారపక్షం సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై రచ్చ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, దానికి అధికార పక్షమే కారణం అని టీడీపీ ప్రత్యారోపణ చేసింది.
ఇది ఇలా ఉండగా ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ద్రవ్యవినిమయ బిల్లు జూన్ 30వ తేదీ సాయంత్రానికి ఆమోదం పొందింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 1న గవర్నర్కు ప్రతిపాదనలను పంపించింది. ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేడు శనివారం, రేపు ఆదివారం కావడంతో సోమవారం ,లేదా మంగళవారాల్లో జీతాలు, పెన్షన్లు అందేఅవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చాకే బిల్లులు తయారు చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.