(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిది)
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీకి ఎట్టకేలకు మూహూర్తం ఖరారు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ ఒకే రోజు పెద్ద ఎత్తున పండుగగా నిర్వహించాలని ఇంతకు ముందు పలు మార్లు తేదీలు ఖరారు చేసినా వాయిదా పడుతూ వచ్చాయి. పలు ప్రాంతాలో భూసేకరణకు సంబంధించి స్థానికంగా వివాదాలు, కోర్టు కేసులు తదితరాల నేపథ్యంలో ఇప్పటి వరకూ మూడు నాలుగు సార్లు ఇళ్లపట్టాల పంపిణీ వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో వివాదాలు, కోర్టు కేసులు లేని భూముల పంపిణీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇప్పటికే భూసేకరణ, స్థలాల విభజన, లేఅవుట్లు పూర్తి చేయడంతో పాటు లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తి అయ్యింది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా అన్ని ప్రదేశాలలో డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,68,281 మంది లబ్దిదారులను అధికారులు గుర్తించారు. వీరందరికీ పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టించనున్నారు. తొలి దశలో 15లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.