అమరావతి: ప్రకాశం బ్యారేజికి మరింత వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దాదాపు ఏడు లక్షల క్యూసెక్కులపైగా వరద నీరు వచ్చే అవకాశం ఉందనీ, గంటగంటకు నీటి మట్టం పెరుగుతున్నదని అనిల్ కుమార్ తెలిపారు. వరద నీటి అంచనా కోసం గత మూడు రోజులుగా డ్రోన్లను వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు.
ఎగువ నుండి వచ్చే వరద వల్ల కరకట్ట వెంట కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయనీ, ఆయా ప్రాంతాల ప్రజల రక్షణ ప్రభుత్వం బాధ్యత అని అనిల్ కుమార్ అన్నారు. రాజకీయ పబ్బం కోసం చంద్రబాబు, టిడిపి నేతలు డ్రోన్ల వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని డ్రామాలు చేస్తున్నారని అనిల్ కుమార్ విమర్శించారు.
ఆ ఇల్లు మునిగిపోతుందన్న విషయం బయట ప్రపంచానికి తెలియనీయకూడదని చంద్రబాబు ఆరాటపడుతున్నారా అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. వరద వస్తే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని ఎప్పుడో చెప్పామనీ, ఇప్పుడు ఇసుక బస్తాలు వేసి వరద నీరు ఇంటిలోకి ప్రవేశించకుండా అష్టకష్టాలు పడుతున్నారని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా సరైన వర్షాలు లేక, ప్రకాశం బ్యారేజికి నీరు రాకపోవడంతో చంద్రబాబు ఇల్లు మునిగిపోలేదని అనిల్ కుమార్ అన్నారు.
ఇదిలా ఉండగా మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో ప్రభుత్వ చర్యలపై ఘాటుగా విమర్శలు చేశారు. చంద్రబాబు ఇంటిపైకి వరద వెళ్లేలా కుట్రలు చేస్తున్నారనీ ఉమ ఆరోపించారు. కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని ఉమ విమర్శించారు. రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారని ఉమ దుయ్యబట్టారు. వైసిపి ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతోందని ఉమా ఆరోపించారు. జగన్ ప్రభుత్వ ఆదేశాలతోనే కిరణ్ అనే వ్యక్తి డ్రోన్లు పంపించారని ఉమ ఆరోపించారు. డ్రోన్లు ప్రయోగించిన వ్యక్తుల వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని ఉమ అన్నారు.
వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాలుగు రోజులుగా చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఉమ పేర్కొన్నారు.