చెన్నై: ఆ ఇద్దరూ గంజాయికీ, మందుకీ అలవాటు పడ్డారు. దానికి రోజూ డబ్బు కావాలి. ఖరీదైన సెల్ఫోన్లు దొంగిలించి అమ్ముకుంటే ఖర్చుకు డబ్బు దొరుకుతుందన్న ఆలోచన వచ్చింది. మరి సెల్ఫోన్లు లాక్కోవాలంటే దానికి చేతిలో ఒక బైక్ ఉండలిగా. మోటార్సైకిళ్లను కూడా దొంగిలించడం మొదలు పెట్టారు. చివరికి పోలీసులకు చిక్కారు.
ఇది ఒక కాలేజీ విద్యార్ధి, ఆమె బాయ్ఫ్రెండ్ కథ. 20 ఏళ్ల స్వాతి కరూరు నుంచి చెన్నై వచ్చింది. ఒక ప్రయివేటు కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చివరి సంవత్సరం చదువుతోంది. పచ్చబొట్లు పొడిచి పొట్ట పోసుకునే 29 ఏళ్ల రాజు ఆమెకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు.
ఇద్దరూ దగ్గరయ్యారు. స్వాతికి రాజు గంజాయి, మద్యం అలవాటు చేశాడు. దురలవాట్ల కారణంగా స్వాతి కాలేజి ఎగ్గొట్టడం మొదలుపెట్టింది. దానితో యాజమాన్యం హాస్టల్ నుంచి పంపించివేసింది. రాజు ఆమెకు ఒక లాడ్జి రూము సంపాదించిపెట్టాడు. ఇద్దరూ అక్కడే కలుసుకునేవారు.
గత సోమవారం ఈ జంట తేనాంపేటలో ఒక యువతి చేతిలో సెల్ఫోన్ లాక్కుని పారిపోయింది. పోలీసులు సిసిటివి విజువల్స్ ఆధారంగా ఇద్దరినీ అరెస్టు చేశారు. వారు నడుపుతున్న బైక్ కూడా చోరీ చేసిందేనని బయటపడింది. గంజాయి, మద్యం అలవాట్ల వల్ల చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో ఇద్దరూ అంగీకరించారు.