AP Police: ఇంతకుముందు తిరుమలలో ఒక కానిస్టేబుల్ కొండెక్కలేని ఒక మహిళను ఆరు కిలోమీటర్లు భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లాడు.అలాగే శ్రీకాకుళం జిల్లాలో శిరీష అనే ఎస్సై గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని స్వయంగా మోసుకొచ్చింది.అప్పట్లో అపురూపం అనిపించిన ఇలాంటి ఘటన ఇప్పుడు ప్రకాశం జిల్లాలోనే జరిగింది.దట్టమైన అడవి ప్రాంతం నుండి అనాధ శవాన్ని రెండు కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకొని గ్రామానికి తీసుకువచ్చి ప్రకాశం జిల్లా పోలీసులు తమ మానవత్వం చాటుకున్నారు అసలేం జరిగిందంటే !
ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం, మర్రిపాలెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో నీ దట్టమైన అడవి ప్రాంతంలో సుమారు 50-60 మధ్య వయస్సు గల ఒక యాచకుడు చనిపోయి ఉన్నట్లు గమనించిన మర్రిపాలెం గ్రామస్తులు సదరు సమాచారాన్ని వెంటనే దోర్నాల ఎస్సై కి తెలియజేశారు.
ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లే హీరోలు!
ఎస్ఐ వెంటనే దోర్నాల పోలీస్ స్టేషన్ లో పనిచేసే జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయిన హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజు,సురేష్ లను సదరు గ్రామానికి పంపారు . వారు వెనువెంటనే మర్రిపాలెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంకు చేరుకొని అక్కడ చనిపోయి ఉన్న యాచకుడిని చూసి, మానవత్వంతో వ్యవహరించి సదరు శవాన్ని స్థానికుని సహాయంతో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఒక కర్రకు కట్టుకొని స్వయంగా తమ భుజాల మీద రెండు కిలోమీటర్లు మోసుకొని గ్రామానికి తీసుకొని వచ్చి, శవ గుర్తింపు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. దోర్నాల పోలీస్ స్టేషన్లో పనిచేసే సదరు హెడ్ కానిస్టేబుల్స్ మానవత్వంతో విధులను నిర్వర్తించిన తీరు పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ,పోలీస్ అధికారులు,ప్రజలు వారిని అభినందించారు.పోలీసు అధికారులు అభినందనలతో సరిపెట్టకుండా వారిని ఘనంగా సత్కరించి అవార్డులు రివార్డులు ఇవ్వటం కూడా అవసరమే!